Hyderabad: సారీ మమ్మీ, సారీ డాడీ.. నన్ను క్షమించండి.. అంటూ నోట్ రాసి..
ABN , First Publish Date - 2023-03-05T13:06:39+05:30 IST
చదువుపై శ్రద్ధ (CONCENTRATION) పెట్టలేకపోతున్నామని.. కళాశాల యాజమాన్యాల ఒత్తిడి.. తల్లిదండ్రుల మందలించారని.. బ్యాక్లాగ్స్(Backlogs) క్లియర్ చేయలేకపోతున్నామని... ఇలా కారణాలు ఏవైనా
బాలానగర్, (ఆంధ్రజ్యోతి): చదువుపై శ్రద్ధ (CONCENTRATION) పెట్టలేకపోతున్నామని.. కళాశాల యాజమాన్యాల ఒత్తిడి.. తల్లిదండ్రుల మందలించారని.. బ్యాక్లాగ్స్(Backlogs) క్లియర్ చేయలేకపోతున్నామని... ఇలా కారణాలు ఏవైనా విద్యార్థులు క్షణికావేశంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కళాశాల వేధింపులకు బలైన ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఉదంతం మరిచిపోకముందే..నగరంలోని బాలానగర్(Balanagar) కు చెందిన శివప్రసాద్ తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై సీలింగ్ ఫ్యాన్ (Ceiling Fans) కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై శ్రద్ధపెట్టలేక పోతున్నాను.. సారీ మమ్మీ, సారీ డాడీ.. నన్ను క్షమించండి.. అంటూ సూసైడ్ నోట్ రాసి బీటెక్(BTech) రెండో సంవత్సరం చదువుతున్న శివప్రసాద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన దంతోజు వెంకటేశ్వర్లు భార్య ముగ్గురు పిల్లలతో కలిసి బాలానగర్ వినాయకనగర్లో నివాసముంటున్నాడు. చిన్న కొడుకు దంతోజు శివప్రసాద్(19) మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యాడు. సెకెండ్ ఇయర్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఫెయిల్ అవుతానేమోనని ఆందోళనకు గురయ్యాడు. తల్లిదండ్రులు అతడికి సర్దిచెబుతూ కాలేజీకి పంపించేవారు. శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన శివప్రసాద్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో లోపలి నుంచి గడియ పెట్టుకుని సూసైడ్ నోట్ను రాసి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి పద్మ, కుమార్తెతో కలిసి తలుపు తట్టినా తీయక పోవడంతో పక్కవారి సాయంతో తీయించి లోనికి వెళ్లగా శివప్రసాద్ విగతజీవిగా కనిపించాడు.
ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరయ్యారు. తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ ఎస్ఐ హరీష్ తెలిపారు.