TSRTC: విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2023-02-26T18:37:36+05:30 IST

హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల (Students) సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

TSRTC: విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్

విద్యార్థులకు అదనపు బస్సుల ఏర్పాటుపై సమావేశం

విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా 100 ట్రిప్పులు

విద్యా సంవత్సరం ముగిసేనాటికి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు

విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తాం

టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ వెల్లడి

హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల (Students) సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులకు బస్సుల ఏర్పాటుపై గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులతో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (TSRTC MD VC Sajjanar) ఆదివారం సమావేశం నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో విద్యార్థుల రద్దీ, ఏర్పాటు చేస్తోన్న బస్సుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సామాజిక బాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యా సంస్థలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ కట్టుబడి ఉందని వివరించారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉందనే విషయం సంస్థ దృష్టికి వచ్చిందని, ఆ కారిడార్‌లోని కాలేజీలకు దాదాపు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారని అధికారులు చెప్పారు. వారిలో 3వ వంతు బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, అందుకు అనుగుణంగా గత వారం రోజులుగా 8 ట్రిప్పులను అదనంగా నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్నీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రద్దీ దృష్ట్యా ఇబ్రహీంపట్నం కారిడార్‌లో 30 అదనపు ట్రిప్పులను నడపాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లో ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయని, అలాగే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌ శివారు విద్యాసంస్థల వరకు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. త్వరలోనే విద్యార్థినుల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయని సజ్జనార్‌ స్పష్టం చేశారు. విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, వారు బస్సులోపలికి ఎక్కి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవనప్రసాద్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఐటీ రాజశేఖర్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఆర్‌ఎంలు వరప్రసాద్‌, వెంకన్నతోపాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-26T18:44:40+05:30 IST