Share News

Land : తెలిసినా.. తెలియనట్లుగా..

ABN , Publish Date - Sep 09 , 2024 | 12:31 AM

చెరువు ఆక్రమించుకున్నారని తెలిసినా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండింది. దీంతో నీరంతా ఆక్రమణకు గురైన భూమిలో చేరింది. ఆ నీటిని తిరిగి చెరువులోకి పంపేందుకు స్థానికంగా కట్టను కొంత తొలగించారు. మరో మారు ఓ మోస్తరు వర్షం కురిసినా స్థానికంగా నిర్మించుకున్న ఇళ్లు నీటమునిగే ప్రమాదం ఉంది. అయినా సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు....

Land : తెలిసినా.. తెలియనట్లుగా..
The pond water that has entered the encroached land due to the recent rains

చెరువు ఆక్రమణలపై చర్యలేవీ..!

చెరువు నిండటంతో ఆక్రమణ భూమిలోకి నీరు

మరోమారు వర్షం వస్తే నిర్మాణాలు మునిగే ప్రమాదం

చర్యలకు మీనమేషాలు

లెక్కిస్తున్న అధికారులు

చెరువు ఆక్రమించుకున్నారని తెలిసినా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండింది. దీంతో నీరంతా ఆక్రమణకు గురైన భూమిలో చేరింది. ఆ నీటిని తిరిగి చెరువులోకి పంపేందుకు స్థానికంగా కట్టను కొంత తొలగించారు. మరో మారు ఓ మోస్తరు వర్షం కురిసినా స్థానికంగా నిర్మించుకున్న ఇళ్లు నీటమునిగే ప్రమాదం ఉంది. అయినా సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

-అనంతపురంరూరల్‌

ఆక్రమణలు వాస్తవమైనా చర్యలు శూన్యం..

అనంతపురంరూరల్‌ మండలం రాచానపల్లి గ్రామ సర్వే నెంబరు 86లో 13.94 ఎకరాల్లో చెరువు ఉంది. గత ప్రభుత్వ హయంలో గ్రామ ప్రజాప్రతినిధి భూమి చెరుకు ఆనుకుని ఉండటంతో ఎకరాకుపైగా ఆక్రమించారు. అందులో 50కి పైగా ప్లాట్లు వేసి ఇతరులకు విక్రయించినట్లు ఆయా వర్గాల ద్వారా తెలిసింది. ప్లాట్లు తీసుకున్న వారిలో కొందరు బండలు పాతుకుని హద్దు ఏర్పాటు చేసుకోగా..మరో ఇద్దరు ముగ్గురు ఏకంగా షెడ్డు, ఇంటి నిర్మాణాలు చేపట్టారు. చెరువు ఆక్రమణలను రెండు నెలల కిందట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఆమేరకు ఇరిగేషన అధికారులు స్థానికంగా విచారణ జరిపారు. ఆ క్రమంలోనే రెవెన్యూ


అధికారులు కూడా సర్వేయర్‌తో సర్వే చేయించారు. చెరువును ఆక్రమించినట్లు నిర్ధారణ జరిగింది. ఈక్రమంలో ఇంటి నిర్మాణాదారులు, స్థలాలు పొందినవారి నుంచి స్థలాలు ఎవరు ఇచ్చారు? ఇంటి నిర్మాణం ఎవరూ చేసుకోమన్నారు? వంటి విషయాలపై వివరాలు సేకరించారు. ఈక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధి స్థలాలు ఇచ్చినట్లు అధికారుల ఎదుట వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నిర్మాణాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించారు. నెల రోజుల కిందట స్థానిక టీడీపీ నాయకులు చెరువు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కలిసి కోరారు. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు.

పొంచిఉన్న ప్రమాదం..

ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండింది. ఈక్రమంలో చెరువుకు అనుకుని ఉన్న భూమిలో చెరువు నీరు చేరాయి. దీంతో ఆక్రమణకు గురైన చెరువు స్థలంలో పెద్ద ఎత్తున నీరు చేరింది. మరో మారు ఓ మోస్తరు వర్షం కురిసినా మరింతగా నీరు చేరే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్థానికంగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న వారి పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. దీని గురించి సంబంధిత అధికారులు ఆలోచించకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.

పోలీసులకు ఫిర్యాదు చేశాం

చెరువులో కొంత భాగం అక్రమణకు గురైంది. చెరువుగట్టుకు ఏర్పాటు చేసిన చెక్‌ డ్యాంను ధ్వంసం చేసి, పైపులు ఏర్పాటు చేశారు. వాటిని మూసివేసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కురిసిన వర్షానికి చెరువునీరు ఆక్రమణ భూమిలోకి వెళ్లడంతో ఆ నీరు దిగువకు వెళ్లేందుకు తాము మూసివేసిన పైపులైన తొలగించేశారు. దీంతో చెరువులో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. -కృష్ణకుమార్‌, ఏఈ ఇరిగేషన


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Sep 09 , 2024 | 12:31 AM