Share News

Rain : ఊరు.. ఏరు!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:32 AM

చీకటి పడ్డ తరువాత దంచికొట్టిన వాన.. తెల్లవారేలోగా కాలనీలను ముంచెత్తింది. అనంతపురంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతానికి తోడు.. కనగానపల్లి చెరువు తెగిపోవడం, ఆ మండలంలో కురిసిన దాదాపు 20 సెంటీమీటర్ల కుండపోత పండమేరుకు చేరడంతో జనం బెంబేలెత్తిపోయారు. అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లి పరిధిలోని జగనన్న కాలనీ, గురుదాస్‌ కాలనీ, ఆటోనగర్‌ ...

Rain : ఊరు.. ఏరు!
Chennekottapalli mandal Haryana Submerged paddy in pond

కాలనీలను ముంచెత్తిన పండమేరు

కనగానపల్లి చెరువు తెగడంతో వరద ఉధృతి

జిల్లా వ్యాప్తంగా కొనసాగిన భారీ వర్షాలు

370 హెక్టార్లల్లో రూ.2.32 కోట్ల పంట నష్టం

అనంతపురం అర్బన, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): చీకటి పడ్డ తరువాత దంచికొట్టిన వాన.. తెల్లవారేలోగా కాలనీలను ముంచెత్తింది. అనంతపురంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతానికి తోడు.. కనగానపల్లి చెరువు తెగిపోవడం, ఆ మండలంలో కురిసిన దాదాపు 20 సెంటీమీటర్ల కుండపోత పండమేరుకు చేరడంతో జనం బెంబేలెత్తిపోయారు. అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లి పరిధిలోని జగనన్న కాలనీ, గురుదాస్‌ కాలనీ, ఆటోనగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జగనన్న కాలనీలో నాలుగైదు అడుగుల ఎత్తువరకు నీరు చేరింది. గురుదాస్‌ కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. అటవీ శాఖ వనమిత్ర వెనుక భాగంలో ఇటీవల వెలిసిన గుడిసెలు నీటిలో తేలియాడే కాగితపు పడవలను తలపించాయి. కొన్ని గుడిసెలు, వాహనాలు ప్రవాహంలో


కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో ఆటోలు, ద్విచక్రవాహనాలు మునిగిపోయాయి. నిత్యావసరాలు, దుస్తులు, సామగ్రి నీటిపాలయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది.

రూ.2.32 కోట్ల పంటనష్టం

జిల్లాలో 370 హెక్టార్లల్లో రూ.2.32 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ పరిధిలో 10 మండలాల్లో 315 హెక్టార్లల్లో రూ.1.70 కోట్ల విలువైన వరి, పత్తి, మొక్కొజొన్న, వేరుశనగ, జొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యానశాఖ పరిధిలో ఏడు మండలాలలో 55 హెక్టార్లల్లో రూ.62.22 లక్షల విలువైన అరటి, మిరప, మామిడి, కళింగర, కర్బూజ, దానిమ్మ, చీనీ, టమోటా పంటలు దెబ్బతిన్నాయి.

రాకపోకలు బంద్‌

వేదవతి హగరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ సమీపంలో కాజ్‌వేపై వదర నీరు పొంగిపొర్లింది. దీంతో కళ్యాణదుర్గం-బళ్లారి మధ్య మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహాళ్‌ మండలం కృష్ణాపురం, కొళగనహల్లి గ్రామాల్లో వరి పంట దెబ్బతింది. మైలాపురం, కొత్తూరు, కానాపురం, ఏలంజి గ్రామాల్లో 300 ఎకరాలలో మొక్కొజొన్న, పత్తి, జొన్న పంటలు నీట మునిగాయి. కంబదూరు మండలం ఒంటారెడ్డిపల్లిలో రైతు వెంకటేశులుకు చెందిన రెండెకరాల్లో మిరప పంట నీటమునిగింది.

కుండపోత వర్షం

అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి కుండపోత వర్షం పడింది. అత్యధికంగా కళ్యాణదుర్గంలో 89.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కంబదూరు 65.4, ఆత్మకూరు 60.0, బుక్కరాయసముద్రం 55.0, నార్పల 48.2, రాప్తాడు 46.4, రాయదుర్గం 45.2, అనంతపురం 42.2 , బ్రహ్మసముద్రం 39.2, శింగనమల 32.4 , శెట్టూరు 31.8, గార్లదిన్నె 29.4, కూడే రు 28.4, బెళుగుప్ప 25.6, కుందుర్పి 24.6, డి. హిరేహాళ్‌ 24.0, కణేకల్లు 23.0, యల్లనూరు 21.2, తాడిపత్రి 13.6, పామిడి 13.4, ఉరవకొండ 12.4 , పుట్లూరు 12.2, బొమ్మనహాళ్‌ 5.4 , గుమ్మఘట్ట 4.8, పెద్దవడుగూరు 2.2, పెద్దపప్పూరు 1.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.

అన్నా.. రైతులను ఆదుకోండి

మంత్రులకు పరిటాల సునీత ఫోన

రాప్తాడు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి ని ఆదుకోవాలని వ్యవసాయ, జలవనరుల శాఖ మంత్రులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విన్నవించారు. నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆమె పర్యటించారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వేలాది ఎకరాల్లో వరి, వేరుశనగ, టమోటా, ద్రాక్ష తదితర పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి ఆరా తీశారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఫోన చేశారు. నష్టం వివరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కనగానపల్లి చెరువు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. చెరువు మరమ్మతులకు ఆదేశాలిచ్చారని, పంట నష్టం అంచనా వేయించి.. పరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు.

చెరువులపై నిఘా వేయండి : కలెక్టర్‌

అనంతపురం టౌన, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో చెరువులపై నిఘా వేయాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్సలో మంగళవారం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాతో భారీ వర్షాలు కురిశాయని, చెరువులు నిండుతున్నాయని అన్నారు. అనంతపురం రూరల్‌ పరిధిలోని ఇళ్లలోకి నీరు చేరిందని, వరద నీటిలో చిక్కుకున్న 110 కుటుంబాలను రెవెన్యూ, పోలీసు అధికారులు కాపాడారని తెలిపారు. వారికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 310 చెరువులు ఉన్నాయని, ఇందులో సగం చెరువులలో 50 శాతం నీరు ఉందని తెలిపారు. ప్రతి చెరువును వీఆర్‌ఓ, వీఆర్‌ఏ తనిఖీ చేస్తుండాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి జిల్లా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. యల్లనూరు, కంబదూరు, నార్పల, కుందుర్పి మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. మైనర్‌ ఇరిగేషన అధికారులు అందుబాటులో ఉండాలని, వాగులు, వంకలు ప్రవహిస్తున్న రహదారుల వద్ద హై అలర్ట్‌ ప్రకటించాలని ఆదేశించారు. ఆ ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా చూడాలని అన్నారు. ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 23 , 2024 | 12:32 AM