CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్లపై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Jun 14 , 2024 | 01:20 PM
శుక్రవారం జరిగిన ఆలిండియా సర్వీసెస్ అధికారుల(IAS, IPS) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పని చేసిన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లోతైన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఎప్పుడూ సన్నిహితంగా, దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో..
అమరావతి, జూన్ 14: శుక్రవారం జరిగిన ఆలిండియా సర్వీసెస్ అధికారుల(IAS, IPS) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పని చేసిన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లోతైన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఎప్పుడూ సన్నిహితంగా, దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో సీనియర్ అధికారులు ఉలిక్కిపడ్డారు. వైసీపీకి అంటకాగిన అధికారుల విషయంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
‘రాష్ట్రాన్ని నాశనం చేశారు.. వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయి.. ఉన్నత స్థానాల్లో ఉన్న మీరు చాలా తప్పులు చేశారు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ‘నా బాధ నా కోసం కాదు.. దెబ్బతిన్న రాష్ట్రం కోసం’ అంటూ తప్పు చేసిన అధికారుల మొహం మీదే కడిగేశారు సీఎం. తన పాలనలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన, ప్రోత్సహించిన అధికారులు సైతం జగన్ కోసం సాగిలపడడం, కుట్రలో భాగస్వామ్యం అవ్వడం, నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం మొదటి మీటింగ్లో ఇంత హాట్ కామెంట్స్ చేయడంతో అధికారుల్లో అలజడి మొదలైంది. అధికారుల విషయంలో చంద్రబాబు అభిప్రాయానికి పార్టీలో, సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. కాగా, రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో సమూల ప్రక్షాళన చేయాలనే గట్టి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు.. అన్ని వ్యవస్థల వరకు అన్నింటిలోనూ ప్రక్షాళనపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. సీఎంవో నుంచి కలెక్టరేట్ వరకు.. హెచ్వోడీ నుంచి ఎస్పీ వరకు అన్ని స్థాయిలలో అధికారుల పనితీరుపై సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నారు సీఎం చంద్రబాబు.