Share News

Crime News: డాయ్ ట్రేడింగ్ యాప్ కేసును ఛేదించిన ఏపీ పోలీసులు..

ABN , Publish Date - Aug 09 , 2024 | 08:47 AM

డాయ్ ట్రేడింగ్ యాప్‌(DAAI Trading App)లో అమాయకుల నుంచి రూ.6కోట్లు పెట్టుబడి పెట్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విష్ణు రఘువీర్ వెల్లడించారు. పలమనేరు మెప్మా కార్యాలయంలో పని చేస్తున్న రాజేశ్(A3) వందల మందిని నమ్మించి ట్రేడింగ్ యాప్‌లో నగదు పెట్టించారని ఆయన తెలిపారు.

Crime News: డాయ్ ట్రేడింగ్ యాప్ కేసును ఛేదించిన ఏపీ పోలీసులు..

చిత్తూరు: డాయ్ ట్రేడింగ్ యాప్‌(DAAI Trading App)లో అమాయకుల నుంచి రూ.6కోట్లు పెట్టుబడి పెట్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విష్ణు రఘువీర్ వెల్లడించారు. పలమనేరు మెప్మా కార్యాలయంలో పని చేస్తున్న రాజేశ్(A3) వందల మందిని నమ్మించి ట్రేడింగ్ యాప్‌లో నగదు పెట్టించారని ఆయన తెలిపారు. రాజేశ్ తాను మోసపోవడమే కాకుండా పలువురు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం అయినట్లు డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.


అసలేం జరిగిందంటే..?

రాజేశ్ అనే వ్యక్తి పలమనేరు మెప్మా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. అయితే అతనికి ఒక రోజు డాయ్ ట్రేడింగ్ యాప్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సందేశంలో మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందని ఉంది. దీంతో వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న బాల సుబ్రహ్మణ్యన్(A1), టీనా(A2) అనే ఇద్దరిని రాజేశ్ సంప్రదించాడు. బాగా సంపాదించవచ్చని వారి చెప్పిన మాటలు నమ్మి పెట్టుబడి పెట్టాడు. మెుదట్లో వారి నమ్మకంగా తిరిగి చెల్లించడంతో తోటి ఉద్యోగులకు దీని గురించి చెప్పాడు. ఇందులో నగదు పెడితే రెట్టింపు వస్తుందని, తనకు కూడా వచ్చినట్లు వారికి చూపించాడు. అది నమ్మిన తోటి ఉద్యోగులు సైతం పెద్దమెుత్తంలో నగదు పెట్టారు. వారు పెట్టడమే కాకుండా తెలిసిన వారికీ చెప్పి సుమారు రూ.6కోట్ల మేర డాయ్ ట్రేడింగ్ యాప్‌లో పెట్టారు.


రాత్రికి రాత్రే..

రాత్రికి రాత్రే యాప్ పనిచేయకపోవడంతో అందరూ అవాక్కయ్యారు. చేసేదేం లేక తమ నగదు తిరిగి ఇప్పించాలని రోడెక్కారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెప్మా ఉద్యోగులు తమ కొంపముంచారని గోడు వెల్లబోశారు. వారు చెప్పడం వల్లనే బంగారం అమ్మి పెట్టామని కొందరు, ద్విచక్రవాహనాలు అమ్మి పెట్టుబడి పెట్టినట్లు మరికొందరు, వడ్డీలకు తెచ్చి మరీ పెట్టినట్లు మరికొందరు పోలీసుల ఎదుట వాపోయారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. విచారణ చేపట్టిన పోలీసులు యాప్ గురించి కూపీ లాగారు. సుబ్రహ్మణ్యన్(A1), టీనా(A2), రాజేశ్(A3)లను ప్రధాన నిందితులుగా గుర్తించారు. దీంతో రాజేశ్‌ను అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ యాప్ మోసం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


మెప్మా ఉద్యోగులు సస్పెండ్..

అయితే ఉద్యోగులుగా ఉండి ప్రజల నుంచి ఇలా పెద్దమెుత్తంలో నకిలీ యాపుల్లో పెట్టుబడి పెట్టించడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన 19మంది మెప్మా సిబ్బందిని ఆయన విధుల నుంచి తొలగించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌ లేదా ఎలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు. ఆన్ లైన్ మోసాలు, సైబర్ క్రైమ్‌లు బాగా పెరిగిపోయాయని వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త మోసాలకు పాల్పడుతూ ప్రజల నుంచి పెద్దమెుత్తంలో దోచేస్తున్నారని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ హెచ్చరించారు.

Updated Date - Aug 09 , 2024 | 08:47 AM