Share News

Encounter: అబూజ్‌మడ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో తెలుగువారు.. ఎవరంటే

ABN , Publish Date - Oct 05 , 2024 | 01:21 PM

చత్తీస్‌గఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోలు ఉన్నట్లు సమాచారం. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జోరీగ నాగరాజు ఎన్‌కౌంటర్‌‌లో హతమైనట్లు తెలుస్తోంది. నాగరాజును పట్టుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది.

Encounter: అబూజ్‌మడ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో తెలుగువారు.. ఎవరంటే

అమరావతి: చత్తీస్‌గఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. అబూజ్‌మడ్‌ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో తెలుగువారు ఉన్నట్లు సమాచారం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జోరీగ నాగరాజు ఎన్‌కౌంటర్‌ హతమైనట్లు తెలుస్తోంది. నాగరాజుకు మావోయిస్టు పార్టీలో పలురకాల పేర్లు ఉన్నాయి. నాగరాజును కమలేష్, రామకృష్ణ, ఆర్కే , విష్ణు అనే పేర్లతో పార్టీలోని కేడర్ పిలుస్తుంటారు. నాగరాజును పట్టుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది. రూ. 25 లక్షల రివార్డ్ ఉండటంతో నాగరాజు కేంద్ర కమిటీలో కూడా సభ్యుడు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు స్వస్థలం విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామం. దండకారణ్యం పార్టీ వ్యవహారాల్లో నాగరాజుది కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


పక్కా సమాచారంతో...

కాగా.. నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్‌, దంతెవాడ సరిహద్దు నెందూర్‌, తులతులి అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఇంటెలిజెన్స్‌ నుంచి సమాచారం అందింది. ఈ రెండు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్)తో పాటు ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్లకు చెందిన మొత్తం 1200 మంది మావోయిస్టుల కోసం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఓర్చా, బారాసూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని గ్రామాలు గోవెల్‌, నెందూర్‌, తులతులి సమీపంలో శుక్రవారం ఉదయం అబూజ్‌మడ్‌లో బలగాలు కూంబింగ్‌ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నెందూర్‌-తులతులి సమీపంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు మొదలు పెట్టడంతో ప్రతిగా బలగాలు తీవ్రంగా స్పందించాయి. ఇరువర్గాల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. సాయంత్రం అడవుల్లో గాలించగా 28 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉంది.


మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. బలగాల్లో పోలీసులు ఎవరికీ గాయాలు కాలేదని బస్తర్‌ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి బస్తర్‌ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. వరుస ఘటనలతో బస్తర్‌ డివిజన్‌ వార్‌జోన్‌‌గా మారింది. ఇప్పటి వరకు జరిగిన 12 భారీ ఎన్‌కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్‌లో, నారాయణ పూర్‌, సుకుమా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో నక్సల్స్‌ పదుల సంఖ్యలో మృతి చెందారు. 2009లో జరిగిన ఎన్‌కౌంటర్ల స్థాయిలో ఈ ఏడాది నక్సల్స్‌ మృతిచెందినట్లు చెబుతున్నారు.


వార్షికోత్సవాల వేళ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీ 20 ఏళ్ల వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుంచి నెల రోజుల పాటు నిర్వహిస్తోంది. సమావేశాల్లో 20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవరోధాలను నక్సల్స్‌ చర్చించనున్నారు. అడవుల్లో సభలు, సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.


గ్రామస్థులూ ఉన్నారా?

ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగింది. ఈ క్రమంలో మృతులంతా మావోయిస్టులేనా? లేదంటే వారిలో గ్రామస్థులూ ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిత్రం కాంకేర్‌ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 12 మంది గ్రామస్తులను బలగాలు పట్టుకుని చంపాయని గ్రామస్తులు, మావోయిస్టులు ఆరోపించారు. తాజాగా ఎన్‌కౌంటర్‌లో కూడా ఇలానే జరిగిందా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 05 , 2024 | 01:47 PM