Share News

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:37 AM

కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్‌..

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

  • సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల బెడదకు విరుగుడు

  • ఇరు రాష్ట్రాల మధ్య ఏడు ఒప్పందాలు

  • బెంగళూరులో పవన్‌కల్యాణ్‌ పర్యటన

  • సీఎం సిద్దరామయ్యతో భేటీ

  • కర్ణాటక అటవీశాఖ మంత్రితో చర్చలు

బెంగళూరు, అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్‌.. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ బీ ఖండ్రే, అటవీ అధికారులతో భేటీ అయ్యారు.

అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడు అంశాలపై చర్చించాం. వాటిపై ఒప్పందాలు చేసుకున్నాం. కర్ణాటక సరిహద్దులోని ఆంధ్రా గ్రామాల్లో ఏనుగుల సమస్య అధికంగా ఉంది. దీనిని పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎనిమిది కుంకిఏనుగులను అందించేందుకు అంగీకరించింది. ఎర్ర చందనం అక్రమ రవాణా కట్టడిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. అటవీ సంపద రక్షణకు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైనా చర్చించాం.

వన్యప్రాణులను చంపి, స్మగ్లింగ్‌ చేసే వారిని కట్టడి చేసేలా రెండు రాష్ట్రాలు సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు వచ్చే కర్ణాటక భక్తుల కోసం యాత్రీసదన్‌ల నిర్మాణానికి భూములు కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. ఎకో టూరిజం అభివృద్ధిపై ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించాం’’ అని పవన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రూ.140 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని కర్ణాటక అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడం అభినందనీయమన్నారు.

అంతకుముందు.. పవన్‌ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రేతో చర్చల కోసం విధానసౌధకు వచ్చారు. చర్చల అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. మంత్రి ఈశ్వర్‌ఖండ్రే మాట్లాడుతూ... ఎర్రచందన అక్రమ రవాణా, వన్యప్రాణుల సంరక్షణ, వాటి పర్యవేక్షణ, ఎకో టూరిజం, వన్యప్రాణుల సంరక్షణపై శిక్షణ, రెండు రాష్ట్రాల మధ్య నాలెడ్జ్‌ బదిలీ, ఏనుగుల నుంచి మనుషుల రక్షణ వంటి అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు.

Updated Date - Aug 09 , 2024 | 04:37 AM