Share News

Visakhapatnam : అరేబియాలో చురుగ్గా నైరుతి

ABN , Publish Date - Jul 08 , 2024 | 02:56 AM

దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇంకా కేరళ నుంచి గుజరాత్‌ వరకు తీరం వెంబడి ద్రోణి విస్తరించింది.

Visakhapatnam : అరేబియాలో చురుగ్గా నైరుతి

  • నేడు కోస్తా, రాయలసీమకు వర్షాలు

విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇంకా కేరళ నుంచి గుజరాత్‌ వరకు తీరం వెంబడి ద్రోణి విస్తరించింది. ఈ రెండింటి ప్రభావంతో అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో దక్షిణ, పశ్చిమ భారతంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా, పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. ఇంకా రుతుపవన ద్రోణి ఉత్తరాదిలోనే కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి గుజరాత్‌కు ఆనుకుని అరేబియా సముద్రం వరకు మరో ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో ఉత్తర, మధ్య భారతంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

కొన్నిచోట్ల భారీ వర్షాలు, ప్రధానంగా ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఈశాన్య భారతాన్ని వణికించిన వరదలు ఇప్పుడు ఉత్తరాఖండ్‌ను అల్లకల్లోలం చేస్తున్నాయి. వర్ష బీభత్సానికి చార్‌ధాం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ద్రోణి ప్రభావంతో ఉత్తరాఖండ్‌లో ఆదివారం అతి భారీ వర్షాలు కురిశాయి. ఇంకా ఈ నెల 11వరకు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, తూర్పు రాజస్థాన్‌లో పలుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 10 వరకు దక్షిణాది పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.

కాగా, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Updated Date - Jul 08 , 2024 | 02:59 AM