Share News

Amaravati : దొరక్కుండా టూర్లు తిప్పుదాం!

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:02 AM

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో..

Amaravati : దొరక్కుండా టూర్లు తిప్పుదాం!

  • విశాఖ ఏజెన్సీ ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు జగన్‌ తాయిలం

  • దక్షిణ భారత యాత్రకు పంపుతున్న వైనం

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో.. వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం మింగుడుపడడం లేదు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. టీడీపీ కూటమికి వారెవరూ అందుబాటులో లేకుండా కుటుంబాలతోపాటు దక్షిణ భారత యాత్రకు పంపుతున్నారు.

ఇప్పటికే అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందినవారిని బెంగళూరు తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ కుటుంబసభ్యులతో గురువారం తాడేపల్లి నివాసానికి తరలివచ్చారు. వారినుద్దేశించి జగన్‌ మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు ఐదు లక్షలు ఇస్తాం.. పది లక్షలు ఇస్తామని బేరసారాలు చేస్తాయని.. వాటికి లొంగిపోయి అమ్ముడుపోవద్దని సూచించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలోకి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున ఇస్తామని నమ్మించి..


కేవలం అడ్వాన్సు ఇచ్చి వదిలేశారని చెప్పారు. ఇప్పుడు కూడా విశాఖ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులకు అడ్వాన్సులతోనే సరిపుచ్చుతారని హెచ్చరించారు. అప్పుడు టీడీపీలోకి వెళ్లినవారు మోసపోయామని తెలిసి వెనక్కి వస్తామంటే రాజకీయ విలువల కోసం తాను రావద్దన్నానంటూ బుధవారం అరకు, పాడేరు నియోజకవర్గాల ప్రతినిధులకు చెప్పిన మాటే చెప్పారు. నాడు టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్‌ లేకుండా పోయిందన్నారు.

విశాఖ స్థానిక సంస్థల్లో టీడీపీ కూటమి కంటే వైసీపీకి సుమారు 400 స్థానాలు అధికంగా ఉన్నా.. పలువురు ప్రజాప్రతినిధులు అధికార కూటమి వైపు చూస్తుండడంతో జగన్‌ ఆందోళన చెందుతున్నారు. ఓవైపు రాజకీయ విలువల గురించి మాట్లాడుతూ.. వారిని పది రోజులపాటు యాత్రలకు పంపుతుండడం గమనార్హం. ఆ తర్వాత విశాఖలో ‘క్యాంపు’ నిర్వహించనున్నారు. ఈ నెల 30న పోలింగ్‌ జరుగనుంది.

Updated Date - Aug 09 , 2024 | 05:02 AM