Share News

YS Sharmila: మంచి ప్రభుత్వమా, ముంచేదా.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

ABN , Publish Date - Sep 25 , 2024 | 02:49 PM

మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కార్‌కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు.

YS Sharmila: మంచి ప్రభుత్వమా, ముంచేదా.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

అమరావతి: మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కార్‌కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 'తాలి బజావ్' కార్యక్రమాన్ని బుధవారం చేపట్టింది.

ఇందులో షర్మిలతోసహా, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలు అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా ? అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ దృష్టిలో ఎన్డీయే ముంచే సర్కారేనని విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలపాలని.. అందుకు తగినట్లు త్వరగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


హామీల అమలు ఎక్కడా..

"టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమది మంచి ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటోంది. ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు. హామీలు అమలు చేయలేని ప్రభుత్వం మంచిదెలా అవుతుంది. సూపర్ సిక్స్‌లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలన్నమాట. ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద ప్రణాళికలు రచించలేదు. ప్రభుత్వంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవు. రైతులకు సంబంధించి కొన్ని పథకాలను ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రూ.20 వేలు ఇస్తామని చెప్పిన హామీ అటకెక్కించారనిపిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ కూటమి సర్కార్ కేవలం 2 లక్షల ఎకరాలే అని తేల్చింది. పరిహారంపై కోత పెట్టిన ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వం అనారా ? రాష్ట్రంలో రైతుల కష్టాలు టీడీపీ కూటమికి కనిపించడం లేదా? వరదలో సర్వస్వం కోల్పోతే కేవలం 4 లక్షల మందికే పరిహారం ఇస్తారా? ప్రధాని మోదీకి కూడా రాష్ట్రమంటే తొలినుంచీ చిన్నచూపు ఉంది. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు నిధులు మంజూరు చేయలేదు.


రాష్ట్రంపై మోదీకి ఉన్న ప్రేమ ఇదేనా. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు జట్టుకట్టారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. తల్లికి వందనం పథకం ఇంకా అమలు లేదు. మహాశక్తి పథకం కింద ఇచ్చే రూ.1,500 ఎక్కడ? కోటి మంది మహిళలకు ఎప్పుడు పథకం వర్తింపజేస్తారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు...బడ్జెట్ లేని రాష్ట్రం కూడా. 100 రోజుల్లో బడ్జెట్ పెట్టే ధైర్యం లేదు. ఏ పథకానికి ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పే వారు లేరు. కనీసం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందించే ధైర్యం కూడా చేయడం లేదు. బాబు సర్కార్ మీదా జనాలు విశ్వసనీయత కోల్పోతున్నారు. మీది ప్రజాప్రభుత్వమైతే వెంటనే సూపర్ సిక్స్ అమలు చేయండి. బాధ్యతలను విజయాలుగా చెప్పుకోవడం మానండి. ప్రభుత్వం దగ్గర నిధులు లేవనకండి. ఎన్నికలకు ముందే రాష్ట్రానికి రూ.11 లక్షల కోట్లు అప్పులున్నాయని మీకు తెలియదా. మీరు మంచి చేస్తారని ఓటేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి" అని వైఎస్ షర్మిల కోరారు.

For Latest News and National News Click here

Updated Date - Sep 25 , 2024 | 03:59 PM