Share News

Kejriwal Quesitons Mohan Bhagat: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 సూటి ప్రశ్నలు

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:45 PM

జైలు నుంచి బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కు 5 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని కోరారు.

Kejriwal Quesitons Mohan Bhagat: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 సూటి ప్రశ్నలు

న్యూఢిల్లీ: జైలు నుంచి బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)కు 5 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని కోరారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 'జనతా కీ అదాలత్' కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ఆదివారంనాడు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూ ఆ పార్టీ విధానాలకు ఆర్ఎస్ఎస్ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. పార్టీలను చీల్చేందుకు సెంట్రల్ ఏజెన్సీలను ఉసిగొల్పడం, విపక్ష ప్రభుత్వాలను కుప్పకూల్చడం, అవినీతి నేతలను పార్టీలోకి తీసుకోవడాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు. రిటైర్‌మెంట్ విషయంలో బీజేపీ రూల్ ఎల్‌కే అడ్వాణికి వర్తంచినట్టుగా మోదీకి కూడా వర్తింపజేస్తారా అని అడిగారు.


కేజ్రీవాల్ 5 ప్రశ్నలివే..

1. ప్రధాన మంత్రి మోదీ దేశంలోని వివిధ పార్టీలకు ఎరచూపించడం, ఈడీ, సీబీఐలతో బెదరించడం ద్వారా వాటిని చీల్చడం, ప్రభుత్వాలను కుప్పకూల్చడం చేస్తున్నారు. ఇది సరైనదేనంటారా?

2.మోదీ ఎవరినైతే అవినీతి పరులని అంటున్నారో వారిని పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీరు ఏకీభవిస్తారా?

3.ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టింది. బీజేపీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్‌కు ఉంది. మోదీజీ తప్పుడు విధానాలను ఆపే ప్రయత్నం ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ చేసిందా?

4.ఆర్ఎస్ఎస్ అవసరం లేదని లోక్‌సభ ఎన్నికల్లో జేపీ నడ్డా చెప్పారు. మాతృసంస్థపై ఆయన ఇంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు మీకు బాధ అనిపించ లేదా?

5. మీ వ్యక్తులే (బీజేపీ) 75 ఏళ్లకు రిటైర్మెంట్ అనే రూల్ పెట్టారు. మోదీకి ఈ నిబంధన వర్తించదని అమిత్‌షా అంటున్నారు. అడ్వానీకి వర్తించిన ఈ రూలు మోదీకి ఎందుకు వర్తించదు?

Jammu and Kashmir: పాక్‌తో చర్చల ప్రసక్తి లేదు: అమిత్‌షా


అందుకే మా నేతల్ని జైల్లో పెట్టారు

గత పదేళ్లుగా తాము ప్రభుత్వాన్ని నిజాయితీతో నడిపామని, ప్రజలకు ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు, ఉచిత వైద్య చికిత్స, అద్భుతమైన విద్య అందించామని అన్నారు. తమపై గెలవాలంటే తమ నిజాయితీపై దాడి చేసి అవినీతిపరులుగా నిరూపించేందుకు మోదీ కుట్రపన్నారని ఆరోపించారు. తనతో పాటు సిసోడియా, ఆప్ నేతలందర్నీ ఒకరి వెంట మరొకరిని మోదీ జైలుకు పంపారని ఆరోపించారు. ఈ కేసు మరో పదేళ్లు పడుతుందని లాయర్లు చెప్పారని, అయితే అన్నేళ్ల పాటు అపవాదు భరించడానికి తాను సిద్ధంగా లేనని, అందువల్లనే తాను ప్రజాకోర్టు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను నిజాయితీపరుడిని కాకుండే ఉచిత విద్యుత్‌కు 3 వేల కోట్లు వెచ్చించేవాడిని కాదని, మహిళలకు రెంట్ ఫ్రీ, పిల్లల కోసం స్కూళ్లు నిర్మించే వాడిని కాదని అన్నారు. బీజేపీ 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడా ఉచిత విద్యుత్ ఇవ్వలేదని, మహిళలకు రెంట్ ఫ్రీ ఎక్కడా లేదని, అప్పుడు దొంగ ఎవరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. నవరాత్రుల్లో తాను అధికారిక నివాసం వీడి ప్రజల్లోనే ఉన్నానని, వారే తనకి వసతి కల్పించారని గుర్తు చేశారు.


Read More National News and Latest Telugu News

Narendra Modi: గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన

Updated Date - Sep 22 , 2024 | 03:45 PM