Share News

Delhi : మళ్లీ తిహాడ్‌కు జైలుకు కేజ్రీవాల్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:11 AM

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆదివారం మళ్లీ తిహాడ్‌ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Delhi : మళ్లీ తిహాడ్‌కు జైలుకు కేజ్రీవాల్‌

  • జైలుకు వెళ్లే ముందు తల్లిదండ్రులకు

  • పాదాభివందనం.. మహాత్మునికి శ్రద్ధాంజలి

  • హనుమాన్‌ మందిరంలో పూజలు

  • ఎప్పుడు వస్తానో తెలియదని వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆదివారం మళ్లీ తిహాడ్‌ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఆ తర్వాత భార్య సునితా కేజ్రీవాల్‌, ఆప్‌ నేతలు అతీశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, కైలాశ్‌ గహ్లోత్‌ సహా ఇతర ముఖ్య నేతలతో కలిసి రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కన్నౌట్‌ ప్లేస్‌లోని హనుమాన్‌ మందిరంలో పూజలు చేశారు.

ఉదయం ఢిల్లీ ఆప్‌ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తనకు 21 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.

21 రోజుల్లో ఒక్క సెకను కూడా వృథా చేయలేదన్నారు. ఆమ్‌ ఆద్మీ కోసమే కాకుండా అనేక పార్టీల కోసం ప్రచారం చేశానని గుర్తు చేశారు. జైలు నుంచి మళ్లీ ఎప్పుడు బయటకు వస్తానో తెలియదన్నారు. కాగా, కేజ్రీవాల్‌ను జూన్‌ 5 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - Jun 03 , 2024 | 05:11 AM