Share News

Delhi : రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

ABN , Publish Date - Jul 28 , 2024 | 02:59 AM

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు.

Delhi : రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

  • ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్‌

  • ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్రకు..

  • జిష్ణు దేవ్‌.. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి

  • బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ సేవలు

  • రాజకుటుంబ నేపథ్యం.. అయోధ్య ఉద్యమంలో పాత్ర

  • దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

న్యూఢిల్లీ, జూలై 27: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. హరిబాబు కిషన్‌రావ్‌ బాగ్డే (రాజస్థాన్‌), ఓం ప్రకాశ్‌ మాథుర్‌ (సిక్కిం), సంతోష్‌ కుమార్‌ గాంగ్వార్‌ (జార్ఖండ్‌), రమెన్‌ దేఖా (ఛత్తీ్‌సగఢ్‌), సీహెచ్‌ విజయశంకర్‌ (మేఘాలయ)లను గవర్నర్లుగా నియమించింది.

కాగా, ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా పంపారు. అసోం గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కఠారియాను పంజాబ్‌ గవర్నర్‌గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అసోం గవర్నర్‌గా పంపుతూ.. మణిపూర్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Jul 28 , 2024 | 03:00 AM