Share News

Pinarayi Vijayan: వయనాడ్‌కు రెడ్ అలర్ట్ ఇవ్వలేదు.. 'షా' వ్యాఖ్యలను ఖండించిన విజయన్

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:43 PM

భారీ వర్షాలు, వరదలతో(Kerala Landslides) అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రం వయనాడ్‌కు భారత వాతావరణ శాఖ ముందుగానే రెడ్ అలర్ట్ జారీ చేసిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు.

Pinarayi Vijayan: వయనాడ్‌కు రెడ్ అలర్ట్ ఇవ్వలేదు.. 'షా' వ్యాఖ్యలను ఖండించిన విజయన్

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో(Kerala Landslides) అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రం వయనాడ్‌కు భారత వాతావరణ శాఖ ముందుగానే రెడ్ అలర్ట్ జారీ చేసిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ముందస్తు అప్రమత్తత సంకేతాలు జారీ చేయలేదంటూ పేర్కొన్నారు.

"విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించిందనేది అవాస్తవం. అధికారులు హెచ్చరికలు జారీ చేయడానికి ముందే కొండచరియలు విరిగిపడ్డాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పును ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడానికి ఇది సమయం కాదు. కష్టా్లో ఉన్న ప్రజలకు భరోసానివ్వాల్సిన సమయమిది. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలి. ఇందుకోసం కేంద్రం మాకు సంపూర్ణంగా సహకరించాలి. కొండచరియలు విరిగిపడటానికి ముందు భారత వాతావరణ శాఖ(IMD) వయనాడ్‌కు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసింది. ఈ ప్రాంతంలో 500 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. కానీ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఐఎండీ అంచనాలకు మించి వర్షాలు పడ్డాయి" అని పినరయి పేర్కొన్నారు.


షా ఏమన్నారంటే..

కేరళ విలయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. జులై 23నే వయనాడ్ ప్రకృతి వైపరీత్యంపై సీఎం పినరయ్ విజయన్‌కి కేంద్ర బలగాలు హెచ్చరించాయని వెల్లడించారు. అయితే కేరళ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలను పట్టించుకోలేదని, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బెటాలియన్‌ల రాకతో కూడా అప్రమత్తం కాలేదని విమర్శించారు.

ఈ విషాద ఘటన తరుణంలో మోదీ ప్రభుత్వం కేరళ సర్కార్‌తోపాటు రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ఏడు రోజుల ముందే జులై 30న రాష్ట్రానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశామని, జులై 24న మరో హెచ్చరిక పంపినట్లు షా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం పినరయి విజయన్ పైవిధంగా వ్యాఖ్యానించారు.


పెరుగుతున్న మృతుల సంఖ్య..

వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు దాదాపు 158 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందునా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 144 మృతదేహాలను వెలికితీసినట్లు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.

భద్రతా బలగాలు 5 వేల 500 మందిని రక్షించాయి. 8 వేల మందికిపైగా బాధితులను 82 శిబిరాలకు తరలించామని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని బాధితులకు పునరావాసం కల్పించి, ఆహారం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.

For Latest News and National News click here

Updated Date - Jul 31 , 2024 | 06:44 PM