Share News

PM Modi : తక్కువ శ్రమతో గరిష్ఠ ప్రయోజనం

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:55 AM

‘ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేను సమావేశమైన ప్రతి దేశాధినేత యోగా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించి..

PM Modi : తక్కువ శ్రమతో గరిష్ఠ ప్రయోజనం

ప్రపంచ శ్రేయస్సుకు యోగా ఓ సాధనం.. యోగా దినోత్సవంలో మోదీ!

శ్రీనగర్‌, జూన్‌ 21: ‘‘ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేను సమావేశమైన ప్రతి దేశాధినేత యోగా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించి.. వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే మార్గం ఇది. అనేక సవాళ్లకు పరిష్కారం చూపుతుంది. తక్కువ శ్రమతో గరిష్ఠ లాభం పొందే విధానం యోగా’’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ శాంతికి యోగాను ఓ సాధనంగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల చార్లెట్‌ చోపిన్‌ ఎన్నడూ భారత్‌ను సందర్శించలేదని, కానీ, యోగా విశిష్టతను తెలుసుకుని జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఫ్రాన్స్‌లో యోగా వ్యాప్తికి కృషి చేసిన ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించామని వివరించారు. శుక్రవారం ప్రపంచ పదో యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని షేర్‌-ఎ-కశ్మీరీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ప్రఖ్యాత దాల్‌ సరస్సు ఒడ్డున 7 వేలమందితో ప్రధాని ఆసనాలు వేసేలా తలపెట్టిన కార్యక్రమ వేదిక వర్షం కారణంగా మారింది.


ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, 2015లో యోగా గురించి తొలిసారి ప్రస్తావించామని, అప్పటినుంచి క్రమంగా మార్పు మొదలైందన్నారు. సమాచార విప్లవ కాలంలో ప్రజలకు ఏకాగ్రత కుదరడం లేదని.. దానికి పరిష్కారమే యోగా అని ప్రధాని చెప్పారు. విశ్వవ్యాప్తమైన యోగా గురించి తెలుసుకునేందుకు భారత్‌కు వేలాదిమంది విదేశీయులు వస్తున్నారని చెప్పారు. కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో యోగా టూరిజం జరుగుతోందని పేర్కొన్నారు. వ్యక్తిగత శిక్షకులను పెట్టుకుని మరీ సాధన చేస్తున్నారని, సంస్థల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఓ విధంగా యోగా సరికొత్త జీవనోపాధులు సృష్టించిందని చెప్పారు. కాగా, యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొని ఆసనాలు వేశారు. ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్య యుద్ధ నౌకపైనా యోగాసనాలు వేశారు. అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్స్‌ స్వ్కేర్‌లో భారత కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో వేలమంది ఆసనాలు సాధన చేశారు.

Updated Date - Jun 22 , 2024 | 03:55 AM