Share News

Rahul Gandhi: వారణాసిలో చెల్లెల్ని పోటీకి దించుంటేనా..?

ABN , Publish Date - Jun 11 , 2024 | 08:14 PM

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రాను పోటీలో దించి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భారీ ఓట్ల ఆధిక్యంతో ఆమె ఓడించేందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: వారణాసిలో చెల్లెల్ని పోటీకి దించుంటేనా..?

రాయబరేలి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi) నియోజకవర్గం నుంచి తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)ను పోటీలో దించి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని భారీ ఓట్ల ఆధిక్యంతో ఆమె ఓడించేందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయానంతరం తొలిసారి రాయబరేలి (Rae Bareli)లోని పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రియాంక వారణాసిలో పోటీ చేసి ఉంటే మోదీని 2-3 లక్షల తేడాతో ఓడించేదని అన్నారు.


ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపరకు గట్టి దెబ్బతగిలింది. సమాజ్‌వాదీ పార్టీ సాధించిన సీట్ల కంటే బీజేపీ తక్కువ సీట్లు సాధించింది. బీజేపీ 33 సీట్లలో గెలుపొందగా, 37 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి గెలిచినప్పటికీ, తొలి రౌండ్లలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే వెనుకబడి, క్రమంగా పుంజుకుని 1.6 లక్షల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో మోదీ సాధించిన ఆధిక్యతతో పోల్చుకున్నా ఈసారి మోదీకి దాదాపు 3 లక్షల ఓట్ల ఆధిక్యం తగ్గింది.

New Odisha CM: ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ


సమాజ్‌వాదీ కార్యకర్తలకు కృతజ్ఞతలు

కాగా, యూపీలో ఎన్డీయే కూటమిదే పైచేయి కావడానికి ఎన్నికల ప్రచారంలో సహకరించిన సమాజ్‌వాదీ పార్టీకి రాయబరేలి కార్యకర్తల సమావేశంలో రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసి జరిపిన పోరాటంలో సహకరించిన ప్రతి కార్యకర్తకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. గతంలోనూ కూటములు ఉన్నప్పటికీ సహాయనిరాకరణ జరిగిందనే ఆరోపణలు వచ్చేవని, ఈసారి మాత్రం కూటమిలోని ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా పరస్పర సహకారంతో కలిసి పనిచేశారని కొనియాడారు. రాజ్యాంగంతో మోదీ, అమిత్‌షా ఆటలాడుకునే ప్రయత్నం చేశారని, ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ నుంచి ముప్పు పెరగనుందని గ్రహించడం వల్లే ఇంతటి ఐక్యత కనిపించిందని రాహుల్ అన్నారు. కాగా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా పార్టీ కార్యకర్తలు సమష్టిగా పోరాటం సాగించారని, అమేథీ నుంచి కిషోరిలాల్ శర్మను గెలిపించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసించారు. రాయబరేలి నియోజకవర్గం నుంచి రాహుల్ ఘనవిజయం సాధించిన అనంతరం ఆ నియోజకవర్గంలో తన చెల్లెలితో కలిసి పర్యటించడం ఇదే మొదటిసారి.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2024 | 08:17 PM