Share News

Rahul Gandhi : తెలుగు భాష కాదు.. చరిత్ర

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:25 AM

‘‘తెలుగు అంటే ఒక భాష కాదు. ఒక చరిత్ర.. ఒక సంప్రదాయం.. ఒక సంస్కృతి’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ ఆదివారం డాల్‌సలో.. టెక్సస్‌ ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

Rahul Gandhi : తెలుగు భాష కాదు.. చరిత్ర

  • తెలుగు ముఖ్యం కాదంటే తెలుగువారిని అవమానించినట్లే

  • ఒక రాష్ట్రం గొప్ప.. మరో రాష్ట్రం కాదు అని ఉండదు

  • ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే పోరాటాలు

  • మోదీపై ప్రజలకు భయం పోయింది

  • అమెరికాలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు అంటే ఒక భాష కాదు. ఒక చరిత్ర.. ఒక సంప్రదాయం.. ఒక సంస్కృతి’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ ఆదివారం డాల్‌సలో.. టెక్సస్‌ ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆరెస్సె్‌సపై నిప్పులు కురిపించారు. భారత సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. తెలుగును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘భారత జాతీయగీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది. అన్ని రాష్ట్రాలను సమానంగా చూపిస్తుంది.

ఒక రాష్ట్రం మాత్రమే గొప్ప అని ఎక్కడా చెప్పదు. ఏ రాష్ట్రం ఎక్కువా కాదు. తక్కువా కాదు. భాషలు సంప్రదాయాలు కూడా సమానమే. తెలుగునే తీసుకోండి.. మనం తెలుగు కేవలం భాషగా మాత్రమే కాకుండా.. చరిత్ర, సంప్రదాయం, సంస్కృతిగా చూస్తాం. హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఒకవేళ ఆ రాష్ట్ర ప్రజలకు చెబితే.. అది వారిని అవమానించినట్లే’’ అని వ్యాఖ్యానించారు. ఈ చిన్న తేడాను కొందరు అర్థం చేసుకోకపోవడం వల్లే భారత్‌లో పోరాటాలు జరుగుతున్నాయంటూ బీజేపీపై ఫైర్‌ అయ్యారు.

భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరమర్యాదలు, మానవత్వం లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము(కాంగ్రెస్‌) మాత్రం కుల, మత, సంస్కృతి, చరిత్ర అనే తరతమబేధాల్లేకుండా ప్రతి ఒక్కరికీ సమానావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఉద్ఘాటించారు. ‘‘ఆరెస్సెస్‌ భారత్‌ను ఒక భావజాలంగా భావిస్తుంది. మహిళలు ఇంటికే పరిమితమవ్వాలనే ధోరణిలో ఉంటుంది. మేము మాత్రం భారత్‌ అంటే.. బహుళ భావజాలాలు అని విశ్వసిస్తాం. అమెరికా మాదిరిగానే మేము కూడా ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించాలని కోరుకుంటాం.


కుల, మత బేధాల్లేకుండా ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకునేందుకు సహకరిస్తాం’’ అని స్పష్టం చేశారు. భారత ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది క్షణాల్లోనే.. ప్రజలు బీజేపీకి, ప్రధాని మోదీకి భయపడడం మానేశారనే విషయాన్ని తాను గుర్తించానన్నారు. ఇది రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న ప్రజలు సాధించిన భారీ విజయంగా ఆయన అభివర్ణించారు. ‘‘నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే.. భారత్‌ అంటే.. రాష్ట్రాల సమాఖ్య. అందుకే అన్ని ప్రాంతాలను, భాషలను, సంస్కృతులను గౌరవించాలి.

అన్ని కులాలను గౌరవించాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ తరతమబేధాలతోనే భారత్‌లో నైపుణ్యం ఉన్నవారిని పక్కనపెడుతున్నారని పేర్కొంటూ.. మహాభారతంలో ఏకలవ్యుడి ఉదంతాన్ని ఉటంకించారు. ‘‘నైపుణ్యత ఉన్నవారిని పాలకులు గౌరవించడం లేదనేది నా భావన’’ అని స్పష్టం చేశారు. తాము విపక్షంలో ఉన్నామని.. విపక్షం అంటే ప్రజల గొంతుక అని అన్నారు. భారత్‌, అమెరికా మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు ఉండాలనేదే తన ఆకాంక్ష అని వివరించారు. చైనాతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగం ఎక్కువ ఉందన్నారు. భారత్‌ సహా.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, ఐరోపా ఉత్పత్తిని మానేసి.. ఆ పనిని చైనాకు అప్పజెప్పాయని, దీని వల్ల ఈ దేశాల్లో నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నారు.


  • భగ్గుమన్న బీజేపీ

ఆరెస్సెస్‌, బీజేపీపై రాహుల్‌గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ద్రోహికి ఆరెస్సెస్‌ అంటే అర్థం కాదని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆరెస్సె్‌సను అర్థం చేసుకోవాలంటే రాహుల్‌ ఎన్నో జన్మలెత్తాలని, దేశాన్ని విమర్శించేందుకు విదేశాలకు వెళ్లేవారికి సంఘ్‌ మూల సిద్ధాంతాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఆరెస్సెస్‌ పాత్ర గురించి రాహుల్‌ ఏదైనా టెక్నాలజీని ఉపయోగించి.. తన నానమ్మ దగ్గర తెలుసుకోవాలన్నారు.

భారతదేశ విలువల నుంచి ఆరెస్సెస్‌ జన్మించిందన్నారు. రాహుల్‌ చైనాను బలపరిచేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తుంటారని బీజేపీ అధికార ప్రతినిఽధులు ప్రదీప్‌ భండారీ, గౌరవ్‌ భాటియా అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో రాహుల్‌ ఎంవోయూ కుదుర్చుకున్నారా? అని ప్రశ్నించారు. రాహుల్‌ బెయిల్‌పై ఉన్నందుకే భారత న్యాయవ్యవస్థను విమర్శిస్తున్నారన్నారు. దేశాన్ని విభజించి, పాలించాలన్న వ్యూహంతోనే ఆయన సామాజిక ఉద్వేగాలను ఆశిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌ భారతీయ దేవతలను అవమానిస్తారని విమర్శించారు.

Updated Date - Sep 10 , 2024 | 06:42 AM