Share News

Sankranti: పల్లెకు పోదాం... చలో.. చలో.. సొంతూళ్లకు నగరవాసుల క్యూ

ABN , Publish Date - Jan 13 , 2024 | 08:03 AM

నగరవాసుల్లో సంక్రాంతి(Sankranti) ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ పండుగను జరుపుకునేందుకు తమ సొంతూళ్లకు క్యూకట్టారు. ఫలితంగా అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీ నెలకొంది.

Sankranti: పల్లెకు పోదాం... చలో.. చలో.. సొంతూళ్లకు నగరవాసుల క్యూ

- కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

- 1.25 లక్షల మంది ముందస్తు రిజర్వేషన్‌

- 19,484 ప్రత్యేక బస్సులు

అడయార్‌(చెన్నై): నగరవాసుల్లో సంక్రాంతి(Sankranti) ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ పండుగను జరుపుకునేందుకు తమ సొంతూళ్లకు క్యూకట్టారు. ఫలితంగా అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీ నెలకొంది. చెన్నై సెంట్రల్‌, ఎగ్మోర్‌, తాంబరం రైల్వేస్టేషన్లు(Chennai Central, Egmore and Tambaram Railway Stations) ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్‌ కంపార్టుమెంట్లలో సైతం ప్రయాణికులు ఎక్కేశారు. ఇక అన్‌రిజర్వుడ్‌ కోచ్‌లో ఊపిరి పీల్చుకోలేనంత రద్దీ ఏర్పడింది. మరోవైపు, ఈ సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్ళేందుకు 1.25 లక్షలమంది ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్నారు. అదేవిధంగా రిజర్వేషన్‌ సౌకర్యంలేని ప్రయాణికుల వీలుగా తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ 19,484 ప్రత్యేక బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంది. ఈ బస్సులు వచ్చే మూడు రోజుల పాటు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళతాయి. ఇందుకోసం నగరంలో ఆరు బస్టాండ్లను ఏర్పాటు చేశారు. ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోని ప్రయాణికుల కోసం కిలాంబాక్కంలో ఇటీవల ప్రారంభించిన కొత్త బస్టాండు నుంచి బస్సులు బయలుదేరి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సెలవులకు తోడు శని, ఆదివారాలు కలిసి రావడంతో ఐదారు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో నగరవాసులు తమ కుటుంబ సభ్యులతో సొంతూర్లకు శుక్రవారం రాత్రి నుంచే బయలుదేరి వెళ్ళారు.

ఫిర్యాదుల స్వీకరణ కోసం హెల్ప్‌లైన్‌

ప్రభుత్వ రవాణా శాఖ నడిపే బస్సుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా 24 గంటల పాటు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం 94450 14450, 94450 14436 అనే నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయగా, ప్రైవేటు బస్సులు అధిక ప్రయాణ చార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు 1800 425 6151 044 లేదా 044- 2474 9002, 044 - 2628 0445, 044- 2628 1611 అనే నంబర్లను ప్రకటించింది.

1.25 లక్షల మంది రిజర్వేషన్‌

ఈ పండుగ కోసం తమ ఊర్లకు వెళ్ళేందుక రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల మంది ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్నారు. వీరిలో ఒక్క చెన్నై నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేందుకు వీలుగా 85 వేల మంది రిజర్వేషన్‌ చేసుకోవడం గమనార్హం. అయితే, రిజర్వేషన్‌ చేసుకోని ప్రయాణికుల కోసం కిళంబాక్కంలోని కొత్త బస్టాండు నుంచి మరికొన్ని ప్రత్యేక బస్సులు నడిపేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది.

మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపేలా రవాణా శాఖ అధికారులు చర్యలలు తీసుకున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం చెన్నై నుంచి రోజువారీగా నడిపే 2100 బస్సులతో పాటు అదనంగా మరో 901 ప్రత్యేక బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లా కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు మరో 1986 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చెన్నై నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం కోయంబేడు, కేకేనగర్‌, తాంబరం, మాధవరం, పూందమల్లి, కిళంబాక్కం ప్రాంతాల్లో ఎక్కేలా ప్రత్యేక బస్టాండ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే, సంక్రాంతి పండుగ ముగించుకుని నగరానికి తిరిగివచ్చే ప్రయాణికుల కోసం ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. రోజువారీగా నడిచే 2100 బస్సులతో 4830 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.

కిక్కిరిసిపోయిన బస్టాండ్లు

సొంతూర్లకు వెళ్ళే ప్రయాణికుల రద్దీ కారణంగా అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల్లో కూడా తీవ్ర రద్దీ నెలకొంది. ప్రభుత్వ బస్సుల్లో రవాణా శాఖ నిర్ణయించిన ప్రయాణ చార్జీలనే వసూలు చేయగా, ప్రైవేటు బస్సుల్లో మాత్రం ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. ఉదాహరణకు చెన్నై నుంచి తిరునెల్వేలికి సాధారణ డీలక్స్‌ బస్సుల్లో రూ.900 నుంచి రూ.2500 వరకు ప్రయాణ చార్జీని వసూలు చేశారు. అదే ప్రైవేటు బస్సుల్లో మాత్రం రెట్టింపు చార్జీలను వసూలు చేశారు.

Updated Date - Jan 13 , 2024 | 08:03 AM