Share News

Supreme Court : తప్పు జరిగితే ఒప్పుకోండి

ABN , Publish Date - Jun 19 , 2024 | 06:08 AM

నీట్‌ పరీక్ష నిర్వహణలో 0.001ు నిర్లక్ష్యం ఉన్నా.. కఠినచర్యలు అవసరమని, తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court : తప్పు జరిగితే ఒప్పుకోండి

0.001% నిర్లక్ష్యం ఉన్నా

కఠిన చర్యలు అవసరం

మోసగాడు వైద్యుడైతే

సమాజానికే హానికరం

నీట్‌ కేసులో ఎన్‌టీఏ,

కేంద్రంపై సుప్రీం వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్ష నిర్వహణలో 0.001ు నిర్లక్ష్యం ఉన్నా.. కఠినచర్యలు అవసరమని, తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడే నీట్‌ పరీక్షలపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం నెలకొంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు పడే శ్రమను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్వహించాలని కేంద్రానికి, ఎన్‌టీఏకి సూచించింది. నీట్‌ అక్రమాలపై దాఖలైన తాజా రిట్‌ పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ఎస్వీ భట్టితో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారంవిచారణకు స్వీకరించింది. అయితే.. నీట్‌పై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి దీన్ని కూడా జూలై 8నే విచారిస్తామని వెల్లడించింది. ‘‘వ్యవస్థను మోసం చేయడం ద్వారా ఒక వ్యక్తి డాక్టర్‌ అయితే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ వ్యక్తి సమాజానికి మరింత హానికరం.

పరీక్ష నిర్వహించే బాధ్యత కలిగిన ఏజెన్సీ నమ్మకంగా, న్యాయంగా వ్యవహరించాలి’’ అని జస్టిస్‌ భట్టి వ్యాఖ్యానించారు. నీట్‌ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు పడే కష్టం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తుచేశారు. ‘‘పరీక్షలు నిర్వహించే వ్యవస్థకు ప్రతినిధిగా మీరు దృఢమైన వైఖరి తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగి ఉంటే.. ‘అవును, ఈ తప్పు జరిగింది. దీనిపై మేం ఈ చర్య తీసుకోబోతున్నాం’ అని చెప్పాలి. కనీసం అప్పుడైనా మీ పనితీరుపై విశ్వాసం కలుగుతుంది. ఎంతో పోటీ నెలకొని ఉన్న ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఎంత శ్రమ పడతారో మనందరికీ తెలుసు’’ అని ఎన్‌టీఏ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. నుంచి దీనిపై సకాలంలో చర్యలు ఆశిస్తున్నామని పేర్కొంటూ.. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో స్పందన తెలపాల్సిందిగా ఏన్‌టీఏకి, కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది.


లీకేజీలకు అడ్డాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతో 24 లక్షల మంది నీట్‌ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారినప్పటికీ ప్రధాని మోదీ ఎప్పటిలాగే మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. బిహార్‌, హరియాణా, గుజరాత్‌లో జరిగిన అరెస్టులు.. నీట్‌ పరీక్షలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందనే విషయాన్ని రుజువు చేస్తున్నాయని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్‌ లీకేజీలకు కేంద్ర బిందువుగా మారాయని మండిపడ్డారు.

పేపర్‌ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన విధానాలను రూపొందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తమ పార్టీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వీధుల నుంచి పార్లమెంటు వరకూ యువత గళాన్ని వినిపిస్తామన్నారు. పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలను రూపొందించి యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని రాహుల్‌ గుర్తు చేశారు. నీట్‌ అక్రమాలు, పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశంలో ప్రవేశ పరీక్షల వ్యవస్థనే దెబ్బతీశాయని కేరళ సీఎం విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై కేంద్రంగానీ, ఎన్‌టీఏగానీ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయాయన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 06:08 AM