Share News

Cheating: నిత్య పెళ్లి కూతురు.. ఎంత మందిని పెళ్లి చేసుకుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..!

ABN , Publish Date - Jul 07 , 2024 | 02:13 PM

ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకులనే చూశారు కదా.. ఇప్పుడు మనం నిత్య పెళ్లి కూతురు గురించి చెప్పుకోబోతున్నాం. ఆమె ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మందిని పెళ్లాడింది. అయితే, ఈ నిత్య పెళ్లి కూతురు వ్యవహారాన్ని ఆమె ఆధార్ కార్డ్ బహిర్గతం చేసింది.

Cheating: నిత్య పెళ్లి కూతురు.. ఎంత మందిని పెళ్లి చేసుకుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..!
Tamil Nadu Woman

చెన్నై, జులై 07: ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకులనే చూశారు కదా.. ఇప్పుడు మనం నిత్య పెళ్లి కూతురు గురించి చెప్పుకోబోతున్నాం. ఆమె ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మందిని పెళ్లాడింది. అయితే, ఈ నిత్య పెళ్లి కూతురు వ్యవహారాన్ని ఆమె ఆధార్ కార్డ్ బహిర్గతం చేసింది. చివరకు ఆమె జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈ నిత్య పెళ్లికూతురు ఎవరు? ఆమె వ్యవహారం ఎలా బయటపడింది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..


తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురానికి చెందిన ఓ యువకుడు బేకరిలో పని చేస్తున్నాడు. అతనికి 35 ఏళ్లు నిండినా.. పెళ్లి కాకపోవడంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ‘అంబి డేట్ ద తమిళ్ వే’లో రిజస్టర్ చేసుకున్నాడు. ఈ వెబ్‌సైట్‌లోనే సంధ్య అనే మహిళ పరిచయమైంది. ఈరోడ్ జిల్లా కొడుమూడికి చెందిన సంధ్య తన వయసు 30 అని.. యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. ఇద్దరూ కొంతకాలం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఆమెకు అవసరమైనప్పుడల్లా యువకుడు డబ్బులు పంపించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు పళని సమీపంలోని ఓ దేవాలయంలో సంధ్య, యువకుడు పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా వారి పెళ్లికి అంగీకరించారు. అంతేకాదు.. పెళ్లి కూతురుకు కావాల్సిన నగలు, పట్టు చీరలన్నీ పెళ్లి కొడుకు కుటుంబమే కొనుగోలు చేసింది.


ఇలా బయటపడింది..

పెళ్లైంది. హ్యాపీగా 3 నెలలు గడిచింది. అయితే, ఆమె ప్రవర్తనలో స్వల్పంగా మార్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా సంధ్య చెప్పిన వయసుకు, ఆమె రూపు రేఖలకు పొంతన లేదు. దీంతో ఆమె ఆధార్ కార్డ్‌ను చెక్ చేశాడు. ఆ కార్డులో భర్త పేరుగా చెన్నైకి చెందిన మరో వ్యక్తి పేరు ఉంది. దీంతో షాక్‌ అయిన యువకుడు.. వెంటనే ఆమెను నిలదీశాడు. దొరికిపోయానని గుర్తించిన మహిళ.. తన భర్తను, అతని కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసింది. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. వెంటనే యువకుడు తారాపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టంతా రట్టయ్యింది.


బాబోయ్ అంత మందిని పెళ్లి చేసుకుందాం..

పోలీసుల విచారణలో ఆ మహిళకి సంబంధించి సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఆమెకు పదేళ్ల క్రితమే ఒకసారి వివాహమైందని.. ఆమెకు ఒక బిడ్డ కూడా ఉందని గుర్తించారు. అంతేకాదు.. అతని నుంచి విడిపోయిన మహిళ.. వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్స్, పోలీసు అధికారులు సహా మొత్తం 50 మందిని ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. పెళ్లి చేసుకోవడం.. కొద్ది నెలల కాపురం తరువాత గొడవపడి నగలు, నగదులో ఇంటినుంచి పారిపోయేది. సంధ్య బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఉన్నారని తెలిసింది. ఒక డీఎస్పీ, పలువురు ఎస్ఐలను కూడా సంధ్య పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. చాలా ఈ పరిస్థితిని బయటకు చెప్పుకోలేకపోవడంతో సంధ్య యధేచ్చగా తన మోసాల పరంపరను కొనసాగిస్తూ వస్తోంది. కానీ, తాజాగా ఆమె గుట్టు రట్టవడంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 07 , 2024 | 02:33 PM