Share News

Modi Cabinet: ఎన్సీపీని బీజేపీ పక్కన పెట్టిందా.. అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా..!

ABN , Publish Date - Jun 10 , 2024 | 08:59 AM

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రి వర్గంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించారు. కానీ మోదీ కేబినెట్‌లో అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకి అవకాశం దక్కలేదు.

Modi Cabinet: ఎన్సీపీని బీజేపీ పక్కన పెట్టిందా.. అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా..!
Ajit Pawar

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రి వర్గంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించారు. కానీ మోదీ కేబినెట్‌లో అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకి అవకాశం దక్కలేదు. దీంతో ఆ పార్టీని బీజేపీ పక్కన పెట్టిందా అనే చర్చ సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించకపోవడంతో అజిత్ పవార్ సేవలకు బీజేపీ ముగింపు పలికినట్లేనంటూ చర్చ సాగుతోంది. అజిత్ పవార్ ఎక్కువమంది ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చి ఎన్డీయేకు మద్దతు ఇచ్చినా.. ఓటు బ్యాంకు మాత్రం అజిత్‌తో రాకపోవడంతో మహారాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ 3.0 కేబినెట్‌లో ఎన్సీపీ మినహా ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య చోటు సంపాదించాయి. ఒక సీటు గెలుచుకున్న జితన్ రామ్ మాంఝీ మోడీ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే మంత్రి పదవి రేసులో ఉన్నప్పటికీ కేబినెట్ పదవి లభించకపోవడంతో ఎన్సీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్సీపీకి సహాయ మంత్రి (ఇండిపెండెంట్) పదవిని బీజేపీ ఆఫర్ చేసింది. ఈ ప్రతిపాదనకు అజిత్ పవార్ అంగీకరించలేదు. దీంతో ఎన్సీపీ మోడీ 3.0 కేబినెట్‌లో చేరలేదు. ఈ చర్యలతో బీజేపీ అజిత్ పవార్ ఆధారపడాలనుకోవడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్


ఎన్నికల్లో పొత్తు..

అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఉంది. మహారాష్ట్రలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి.. కేవలం ఒకచోట మాత్రమే గెలిచింది. ఎన్సీపీ నుంచి సునీల్ తట్కరే మాత్రమే లోక్‌సభ ఎంపీగా గెలిచారు. మోదీ కేబినెట్‌లో స్థానాన్ని ఎన్సీపీ ఆశించింది. అయితే సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. దీనికి అజిత్ పవార్ అంగీకరించలేదు. ప్రపూల్ పటేల్ గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారని.. అటువంటి పరిస్థితుల్లో సహాయ మంత్రి (ఇండిపెండెంట్) బాధ్యతలు తీసుకోవడం సరైనది కాదని.. అవసరమైతే కేబినెట్ మంత్రి కోసం కొద్దిరోజులు వేచిచూస్తామని అజిత్ తెలిపారు. బీజేపీ కూడా వేచిచూసే ధోరణిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.


అసలు లెక్కలు ఇవే..

మహారాష్ట్రలో రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు బీజేపీ అజిత్ పవార్‌ను తన వెంట తెచ్చుకుంది. కానీ కమలం పార్టీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అజిత్ పవార్ పార్టీ పోటీ చేసిన నాలుగు సీట్లలో ఒకదానిని మాత్రమే గెలుచుకుని.. 3.6 శాతం ఓట్లు సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని మహారాష్ట్రలో 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. దీంతో ప్రజలు అసలైన ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్‌ను గుర్తించారనే స్పష్టమైంది. అజిత్ పవార్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపించకపోవడంతో అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే చర్చ మొదలైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు అజిత్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎన్డీయేతో ప్రయాణిస్తారా.. ఇండియా కూటమిలో చేరతారా అనేది ఆసక్తికరంగా మారింది.


K Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌ బైబై

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 08:59 AM