Share News

Rohit Sharma: చిక్కుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ చర్యలు..?

ABN , Publish Date - Jan 08 , 2024 | 09:37 PM

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత పిచ్‌లపై రోహిత్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్‌గా ఉందని సమాచారం. దీంతో అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Rohit Sharma: చిక్కుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ చర్యలు..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత పిచ్‌లపై రోహిత్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్‌గా ఉందని సమాచారం. దీంతో అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రోహిత్‌ వ్యాఖ్యలను తప్పుగా భావిస్తే అతడికి జరిమానా, కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించే ప్రమాదం ఉందని టాక్ నడుస్తోంది. దక్షిణాఫ్రికాలో ఇటీవల కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సిరాజ్‌ దెబ్బకు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో పేకమేడలా కుప్పకూలింది. దీంతో రెండో టెస్ట్‌ను టీమిండియా ఒకటిన్నర రోజుల్లోనే ముగించి ఘన విజయం సాధించడమే కాకుండా రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసి పరువు నిలబెట్టుకుంది.

అయితే కేప్‌టౌన్ టెస్టు అనంతరం రోహిత్ ఐసీసీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ టెస్టులో ఏం జరిగిందో, పిచ్‌ ఎలా ప్రవర్తించిందో అందరూ చూశారు. ఇండియాకు వెళ్లినప్పుడు అక్కడి పిచ్‌ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే, ఇలాంటి పిచ్‌పై ఆడేందుకు నిజంగానే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పిచ్‌ చాలా ప్రమాదకరంగా ఉంది. మాకు పెద్ద సవాలు విసిరింది. భారత్‌ పిచ్‌లపై కూడా ఇలాంటి సవాలే ఉంటుంది. మేము టెస్టు క్రికెట్‌ ఆడేందుకు వచ్చాం. పిచ్​ఎలా ఉన్నా ఆడాల్సిందే. కానీ భారత్‌లో తొలి రోజు నుంచే స్పిన్‌ తిరిగితే అందరు ఏదేదో మాట్లాడతారు. మొదటి రోజు నుంచి బంతి సీమ్‌ అయితే పర్వాలేదు. కానీ బంతి తిరిగితే మాత్రం ఒప్పుకోరా? ఈ విషయంలో తటస్థంగా ఉండాలి. పిచ్‌లకు రేటింగ్‌ ఇచ్చేటప్పుడు రిఫరీలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. విభిన్న పరిస్థితుల్లో ఆడడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. విదేశీ జట్లు భారత్​లో ఆడేటప్పుడు పిచ్‌లను విమర్శించకుండా, ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేయాలి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్లేయర్లు వాళ్ల దేశాల్లో కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ, భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లను విమర్శిస్తారు. అది మారాలి’ అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 09:37 PM