Share News

IND vs ENG: డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ అందుకున్న రికార్డులివే!

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:13 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ జైస్వాల్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.

IND vs ENG: డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ అందుకున్న రికార్డులివే!

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ జైస్వాల్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు. మిగతా భారత బ్యాటర్లంతా విఫలమైన వైజాగ్ పిచ్‌పై జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు. వరుసగా సిక్సు, ఫోర్ కొట్టిన జైస్వాల్ 277 బంతుల్లోనే డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ హాఫ్ సెంచరీని ఫోర్‌తో, సెంచరీని సిక్సుతో, 150 పరుగులను ఫోర్‌తో, డబుల్ సెంచరీని ఫోర్‌తో పూర్తి చేయడం గమనార్హం. జైస్వాల్ ఊచకోతతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. ఈ క్రమంలో జైస్వాల్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.


1. టెస్టు క్రికెట్‌లో వైజాగ్‌లో డబుల్ సెంచరీ కొట్టిన రెండో బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. గతంలో మయాంక్ అగర్వాల్ కూడా ఇక్కడ డబుల్ సెంచరీ చేశాడు.

2. అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ 22 సంవత్సరాల 37 రోజుల వయసులో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తొలి స్థానంలో ఉన్నాడు. కాంబ్లీ 21 ఏళ్ల 35 రోజుల వయసులో, 21 ఏళ్ల 55 రోజుల వయసులో రెండు సార్లు డబుల్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత 21 ఏళ్ల 283 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేసిన సునీల్ గవాస్కర్ రెండో స్థానంలో ఉన్నాడు.

3. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఎడమ చేతి బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ, వినోద్ కాంబ్లీ రెండు సార్లు, గౌతం గంభీర్ డబుల్ సెంచరీ సాధించారు.

4. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ తన 10వ ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ చేశాడు. తన మూడో ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా ఉన్నారు.

5. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చరిత్రలో డబుల్ సెంచరీ నాలుగో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ కూడా ఈ ఘనత సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 03 , 2024 | 12:13 PM