Share News

SRH vs GT: తడబడిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. గుజరాత్ ముందు మోస్తారు లక్ష్యం

ABN , Publish Date - Mar 31 , 2024 | 05:23 PM

ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సునాయసంగా 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కనీసం ఒక బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

SRH vs GT: తడబడిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. గుజరాత్ ముందు మోస్తారు లక్ష్యం

అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సునాయసంగా 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కనీసం ఒక బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 29 పరుగుల చొప్పున చేసిన అభిషేక్ శర్మ, అబ్దుల్ సమదే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తరఫున టాప్ స్కోరర్లుగా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ముందు 163 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ(3/25) చెలరేగాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను అప్ఘానిస్థాన్ బౌలర్లు గట్టి దెబ్బ తీశారు. రైజర్స్ 3 కీలక వికెట్లను అప్ఘానిస్థాన్ బౌలర్లు పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఐదో ఓవర్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(16) వికెట్ కోల్పోయింది. కాసేపటి తర్వాత మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(19)ను స్పిన్నర్ నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 58 పరుగులకు హైదరాబాద్ జట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం మాక్రమ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే అభిషేక్ శర్మను 10వ ఓవర్‌లో సీనియర్ పేసర్ మోహిత్ శర్మ ఔట్ చేశాడు. 2 ఫోర్లు, 2 సిక్సులతో 20 బంతుల్లో అభిషేక్ శర్మ 29 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్లాసెన్ తన ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. ఈ క్రమంలో మాక్రమ్‌తో కలిసి జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించాడు. అయితే ధాటిగా ఆడుతున్న క్లాసెన్‌ను 14వ ఓవర్‌లో స్పిన్నర్ రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒక ఫోర్, 2 సిక్సులతో క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ కీలక బ్యాటర్లైనా మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, క్లాసెన్‌ను అఫ్ఘానిస్థాన్ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ ఔట్ చేయడం గమనార్హం.


ఆ తర్వాతి ఓవర్‌లోనే మాక్రమ్(17)ను ఉమేష్ యాదవ్ ఔట్ చేశాడు. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్‌తో మాక్రమ్ ఔట్ అయ్యాడు. దీంతో 114 పరుగులకే సన్‌రైజర్స్ సగం వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో సన్‌రైజర్స్‌ను షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో 45 పరుగులు జోడించారు. దీంతో సన్‌రైజర్స్ స్కోర్ 150 పరుగులు దాటింది. ధాటిగా ఆడిన సమద్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షాబాజ్ అహ్మద్(22), వాషింగ్టన్ సుందర్‌ను మోహిత్ శర్మ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. సుందర్ డకౌట్ అయ్యాడు. 3 ఫోర్లు, ఒక సిక్సుతో 15 బంతుల్లో 30 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. దీంతో చివరి ఓవర్లో 3 పరుగులు మాత్రమే రాగా 3 వికెట్లు పడ్డాయి. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 162/8 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లతో చెలరేగాడు. అజ్మతుల్లా, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చరిత్ర సృష్టించిన చెన్నైసూపర్ కింగ్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..

IPL 2024: సన్‌రైజర్స్‌కు భారీ దెబ్బ.. టోర్నీ మొత్తానికి స్టార్ ఆటగాడు దూరం

Updated Date - Mar 31 , 2024 | 05:45 PM