Share News

Mahabubabad: కల్తీ కల్లు తాగి.. ఇద్దరి మృతి!

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:58 AM

స్నేహితుల పుట్టినరోజు వేడుక రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పార్టీలో భాగంగా కల్లు తెప్పించగా దాన్ని తాగిన ముగ్గురు యువకులూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు.

Mahabubabad: కల్తీ కల్లు తాగి.. ఇద్దరి మృతి!

  • మరొకరు విషమం.. బర్త్‌డే వేడుకలో విషాదం

  • మహబూబాబాద్‌ జిల్లా రామన్నగూడెంలో..

  • పార్టీలో 17 మంది.. కలు ్లతాగింది ముగ్గురే

  • విషం కలిపి ఉంటారా? ఘటనపై అనుమానాలు

నర్సింహులపేట (మహబూబాబాద్‌ జిల్లా), జూలై 4: స్నేహితుల పుట్టినరోజు వేడుక రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పార్టీలో భాగంగా కల్లు తెప్పించగా దాన్ని తాగిన ముగ్గురు యువకులూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరొకరు ఆస్పత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మహూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో ఈ విషాద ఘటన జరిగింది. ఎస్సై సతీశ్‌, గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొంతు విజయ్‌, గొడిశాల మనోజ్‌, బోగోజి శ్రావణ్‌ (26), ఎస్కే రహీంపాష (25), ఉపేంద్రాచారి స్నేహితులు. జూన్‌ 10న విజయ్‌, మనోజ్‌ పుట్టినరోజు కావడంతో ఆ రోజు స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. సాయంత్రం శ్రావణ్‌, రహీం పాష, ఉపేంద్రచారి మరో 12మంది యువకులు కలిసి ఊరు చివరన విజయ్‌, మనోజ్‌తో కేక్‌ కటి చేయించి వేడుక చేసుకున్నారు. చికెన్‌తో భోజనం చేశారు. కొందరు మద్యం తాగారు.


రామన్నగూడెం, ముంగిమడుగు గ్రామాల చెందిన ముగ్గురు గీతకార్మికుల వద్ద 12సీసాల కల్లు తెప్పించారు. ఆ కల్లును శ్రావణ్‌, రహీం పాష, ఉపేంద్రాచారి తాగారు. మరుసటిరోజు నుంచి ఈ ముగ్గురూ తీవ్రమైన జర్వం, ఒళ్లునొప్పులతో బాదపడ్డారు. జూన్‌ 18న మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు. రక్త పరీక్షలు చేయగా కామెర్లు వచ్చినట్లు తేలింది. ఆ డాక్టర్‌ మందులు ఇచ్చినప్పటికీ జ్వరం మరింత తీవ్రం కావడంతో వారు 26న ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లి మరోసారి రక్త పరీక్షలు నిర్వహించారు. కల్లులో రసాయనాలను కలపడంతో అది మిథనాల్‌గా మారిందని.. కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడిందని వైద్యులు వెల్లడించారు. ఆ మరుసటి రోజు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న ముగ్గురిలో శ్రావణ్‌ బుధవారం మధ్యాహ్నం, రహీం పాషా గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ఉపేంద్రాచారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.


విషప్రయోగంపై అనుమానాలు..

కల్లులోనే ప్రాణాంతకరమైన మందులు కలిపి ఉండొచ్చని బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేడుకలో పాల్గొన్న కొందరు స్నేహితులే ఆ ముగ్గురిపై విషప్రయోగం చేసి, ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న యువకులు రెండు గ్రూపులుగా విడిపోయారని, కొందరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని, ఈ క్రమంలో వారిలోనే కొందరు ముగ్గురిపై విషప్రయోగం చేసి ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 04:58 AM