Share News

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:10 AM

ప్రముఖ సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌ తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌)కు చిక్కాడు. హైదరాబాద్‌ హైదర్షాకోట్‌లోని విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న టీజీ న్యాబ్‌ అధికారులు.. సైబరాబాద్‌ పోలీసులతో కలిసి దాడులు చేశారు.

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

  • కొకైన్‌ తీసుకున్న అమన్‌ ప్రీత్‌సింగ్‌

  • డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ నైజీరియా మహిళ

  • రైళ్లు, విమానాల్లో హైదరాబాద్‌కు కొకైన్‌

  • రాజేంద్రనగర్‌లో ఆట కట్టించిన టీజీన్యాబ్‌

  • రూ. 35లక్షల విలువైన కొకైన్‌ స్వాధీనం

  • ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురి అరెస్టు

  • అదుపులో 13 మంది వినియోగదారులు

  • పరీక్షల్లో 10 మందికి పాజిటివ్‌

  • గతంలో డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌ పేరు

  • సినీ పరిశ్రమలో మళ్లీ చర్చనీయాంశం

హైదరాబాద్‌ సిటీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌ తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌)కు చిక్కాడు. హైదరాబాద్‌ హైదర్షాకోట్‌లోని విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న టీజీ న్యాబ్‌ అధికారులు.. సైబరాబాద్‌ పోలీసులతో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో.. అమన్‌ ప్రీత్‌సింగ్‌ సహా.. 13 మంది వినియోగదారులు పట్టుబడ్డారు. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురు డ్రగ్స్‌ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు నిర్వహించిన డ్రగ్స్‌ పరీక్షల్లో 10 మంది పాజిటివ్‌గా తేలగా.. వారిలో అమన్‌ ప్రీత్‌సింగ్‌ కొకైన్‌ తీసుకున్నట్లు తేలిందని రాజేంద్రనగర్‌ డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు.


సోమవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ‘‘నైజీరియాకు చెందిన ఒనూహ బ్లెసింగ్‌ అలియాస్‌ జొయానాగోమ్స్‌ అలియాస్‌ జో అనే మహిళ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ అని గుర్తించాం. ఆమెతోపాటు నైజీరియాకు చెందిన అజీజ్‌ నోహిమ్‌ అడెషోలా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్‌, సానబోయిన వరుణ్‌కుమార్‌, మహమ్మద్‌ మహబూబ్‌ షరీఫ్‌ వీరి ముఠాలో పెడ్లర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు ఉప్పందడంతో దాడి చేసి, అరెస్టు చేశాం. వీరి నుంచి రూ.35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్‌ను సీజ్‌ చేశాం. ఇదే ముఠాకు చెందిన నైజీరియన్‌ స్మగ్లర్లు డైవిన్‌ ఎబుకా అలియాస్‌ ఇమాన్యుయెల్‌, ఎజియోనిలి ఫ్రాంక్లిన్‌ అలియాస్‌ కలేషీ పరారీలో ఉన్నారు’’ అని డీసీపీ వివరించారు. కింగ్‌పిన్‌ మహిళ-- జొయానాగోమ్స్‌ 2017లో భారత్‌కు వచ్చి.. బెంగళూరులో హెయిర్‌ స్టైలి్‌స్టగా పనిచేసిందని, ఆ సమయంలోనే ఆమెకు నైజీరియాకు చెందిన డ్రగ్స్‌ స్మగ్లర్‌ డైవిన్‌ ఎబుకాతో పరిచయం ఏర్పడిందని చెప్పారు.


2018 నుంచి ఆమె డ్రగ్స్‌ సరఫరాలో కీలకంగా మారిందని పోలీసులు గుర్తించారు. ఆమెపై 2019లో ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎన్డీపీఎస్‌ కేసు నమోదైనట్లు డీసీపీ వివరించారు. ‘‘జొయానాగోమ్స్‌ తన పాస్‌పోర్టును దాచి, మారు పేరుతో పశ్చిమ ఆఫ్రికా పాస్‌పోర్టు సంపాదించింది. గినీబిసావు అనే పేరుతో భారత్‌లో చలామణి అయ్యింది. పోలీసులకు పట్టుబడ్డప్పుడు మారు పేరు, నకిలీ పాస్‌పోర్టును వాడుకునేది. నైజీరియాకు వెళ్లినప్పుడు మాత్రం తన అసలు పాస్‌పోర్టును వాడేది. మరో నిందితుడు అజీజ్‌ నోహీమ్‌ 2014లో విద్యార్థి వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు.


ఉస్మానియా వర్సిటీలో నకిలీ డీడీ సమర్పించిన కేసులో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక.. ఎజియోనిలి ఫ్రాంక్లిన్‌తో పరిచయం ఏర్పడడంతో డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు’’ అని డీసీపీ వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన గౌతమ్‌, వరుణ్‌, షరీ్‌ఫలు డ్రగ్స్‌ సరఫరాలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. గౌతమ్‌ ఏడు నెలల కాలంలో 2.6 కిలోల కొకైన్‌ను సరఫరా చేశాడన్నారు. వరుణ్‌ ఈ ముఠా నుంచి ఒక్కో గ్రాము కొకైన్‌కు రూ.8 వేలు చెల్లించేవాడని, దాన్ని 12 వేలకు అమ్మేవాడని పేర్కొన్నారు. మరో నిందితుడు షరీఫ్‌ కొరియోగ్రాఫర్‌ అని.. వరుణ్‌, గౌతమ్‌లతో ఉన్న పరిచయంతో సినీ ఇండస్ట్రీలో వినియోగదారులకు డ్రగ్స్‌ సరఫరా చేసేవాడని వివరించారు. విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో 13 మంది డ్రగ్స్‌ కస్టమర్లను అరెస్టు చేశామని, ఉస్మానియా ఆస్పత్రిలో వారికి డ్రగ్స్‌ టెస్ట్‌లు నిర్వహించగా.. 10 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. పాజిటివ్‌లుగా గుర్తించిన వారిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ఉన్నట్లు డీసీపీ తెలిపారు.


స్మగ్లరా? కస్టమరా??

రకుల్‌ సోదరుడు ప్రస్తుతానికి కస్టమరేనని తాము గుర్తించినట్లు టీజీ న్యాబ్‌ పోలీసులు తెలిపారు. అతను నిజంగానే కస్టమరా? లేక డ్రగ్స్‌ సప్లయరా? అనేది దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్యానించారు. గతంలో డ్రగ్స్‌ కేసులో రకుల్‌ పేరు బయటపడిన నేపథ్యంలో.. ఇప్పుడు అమన్‌ పోలీసులకు పట్టుబడడం సినీ ఇండస్ట్రీలో మరోమారు చర్చనీయాంశమైంది. అప్పట్లో రకుల్‌ ఈడీ విచారణను సైతం ఎదుర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఇదే విషయమై డీసీపీని ప్రశ్నించగా.. ‘‘ముఠాను పట్టుకున్న రెండు గంటల్లోనే ప్రెస్‌మీట్‌ పెట్టాం. పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉంది. ఆ తర్వాతే అమన్‌ కస్టమరా? లేక స్మగ్లరా? అనే విషయాలు తేలుతాయి. అప్పుడు మరో ప్రెస్‌మీట్‌ పెడతాం’’ అని వ్యాఖ్యానించారు.


స్మగ్లర్స్‌ను పట్టిస్తే రూ.4లక్షల నజనారా

ఈ కేసులో పరారీలో ఉన్న నైజీరియన్‌ స్మగ్లర్లు డైవిన్‌ ఎబుకా, ఎజియోనిలి ఫ్రాక్లిన్‌ను పట్టిచ్చినా.. వారి జాడ తెలిపినా రూ.4 లక్షల నజరానాను టీజీ న్యాబ్‌ ప్రకటించిందని డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ విలేకరులకు తెలిపారు. పరారీలో ఉన్న ఒక్కో నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ఉన్నట్లు వివరించారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. +91 8712671111 నంబర్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని కోరారు.

Updated Date - Jul 16 , 2024 | 04:10 AM