Share News

Hyderabad: వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కాటసాని మా ప్లాట్లను కబ్జా చేశారు

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:04 AM

‘‘పైసాపైసా కూడబెట్టి ప్లాట్లు కొన్నాం. మా ప్లాట్ల పక్కనే కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎ్‌సఆర్సీపీ నేత కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరమ్మ భూమిని కొనుగోలు చేశారు.

Hyderabad: వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కాటసాని మా ప్లాట్లను కబ్జా చేశారు

  • సర్వే చేసి మా ప్లాట్లను మాకు ఇప్పించండి

  • పద్మావతినగర్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి

పంజాగుట్ట, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘పైసాపైసా కూడబెట్టి ప్లాట్లు కొన్నాం. మా ప్లాట్ల పక్కనే కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎ్‌సఆర్సీపీ నేత కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరమ్మ భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత మా ప్లాట్లను కబ్జా చేశారు. వాటిలోకి వెళ్లకుండా.. చుట్టూ ప్రహరీగోడ కట్టారు’’ అని అమీన్‌పూర్‌ ప్రాంతంలోని పద్మావతినగర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి, ప్లాట్ల యజమానులు మాట్లాడారు. 1986లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన రైతులు, తదితరుల నుంచి 24 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని వారు వివరించారు.


గ్రామ పంచాయతీ అనుమతితో లేఅవుట్‌ను అభివృద్ధి చేశామన్నారు. ‘‘2006లో మా లేఅవుట్‌ పక్కన కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆయన భార్య 58 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మా లేఅవుట్‌లో ఉన్న 35 ప్లాట్లను కొన్నారు. వాటిని చదును చేస్తూ మా ప్లాట్లను కబ్జా చేసి, చుట్టూ ప్రహరీగోడను నిర్మించారు. మేంప్రహరీ గోడను కూల్చేస్తే.. మళ్లీ నిర్మించుకుని, మా ప్లాట్లలోకి వెళ్లకుండా చేశారు. శిష్లా రమేశ్‌ అనే వ్యక్తి కూడా తప్పుడు పత్రాలను సృష్టించి, మా ప్లాట్లలో కొన్నిటిని ఇతరులకు విక్రయించాడు. కొన్నిటిని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాడు’’ అని వాపోయారు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న మాకు.. హైడ్రా రూపంలో ఓ ఉపశమనం లభించింది. కాటసాని ఆక్రమించిన ప్రహరీగోడతోపాటు.. కొన్ని కట్టడాలను హైడ్రా కూల్చివేసిందన్నారు. అయినా సమస్య తీరలేదని, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి, సర్వే చేయించి ప్లాట్లను తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 03:04 AM