Share News

Bandi Sanjay: కేసీఆర్‌ సూచనతోనే సింఘ్వీ ఎంపిక!

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:24 AM

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ కోసం ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థిని నిలబెట్టలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణ చేశారు.

Bandi Sanjay: కేసీఆర్‌ సూచనతోనే సింఘ్వీ ఎంపిక!

  • కవిత బెయిల్‌కు వాదించిన సింఘ్వీ

  • అందుకే ‘రాజ్యసభ’కు కారు దూరం

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ కోసం ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థిని నిలబెట్టలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్‌ సూచన మేరకే కాంగ్రెస్‌ నాయకత్వం సింఘ్వీని బరిలోకి దింపిందని చెప్పారు. తిహాడ్‌ జైల్లో ఉన్న కవితకు బెయిల్‌ ఇప్పించేందుకు సింఘ్వీ కింది కోర్టులో విశ్వప్రయత్నాలు చేశారని.. దానికి ప్రతిఫలంగా కేసీఆర్‌, రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్‌ఎస్‌ తరఫున అభ్యర్థిని నిలబెట్ట్టలేదని తెలిపారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకత్వాలు కలిసే ఆయన అభ్యర్థిత్వాన్ని నిర్ణయించాయన్నారు. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగానే సింఘ్వీ నామినేషన్‌ వేశారని పేర్కొన్నారు. అతి త్వరలో బీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రె్‌సలో విలీనం చేయడం తథ్యమని సంజయ్‌ చెప్పారు. 39 మంది ఎమ్మెల్యేలున్నా రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తే గెలిచేదేనని స్పష్టం చేశారు. కాంగ్రె్‌సలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగేదన్నారు. పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫాంహౌ్‌సలో కేసీఆర్‌తో భేటీ అయ్యారని చెప్పారు. కాంగ్రె్‌సలో కేసీఆర్‌ ఆడిందే ఆట.. పాడిందే పాట అని, అందుకే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలుస్తున్నారని తెలిపారు.


బుధవారమిక్కడ సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఐదారేళ్లుగా దొంగ నాటకాలాడుతూ ప్రజల్లో అయోమయం సృష్టించారన్నారు. ఇప్పుడు వారి నాటకాలకు తెరపడిందని.. కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ విలీనం కాబోతోందని పునరుద్ధాటించారు. రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు గడువు బుధవారంతో ముగిసింది. బీఆర్‌ఎ్‌సకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో కొంతమంది కాంగ్రె్‌సలో చేరినా, విప్‌ జారీచేస్తే బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాల్సిందేనని సంజయ్‌ చెప్పారు. కానీ, ఢిల్లీలో జరిగిన ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌ తన అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల డ్రామా అని మండిపడ్డారు.


  • హైడ్రా దాడుల వెనక వసూళ్ల దందా

హైడ్రా దాడుల వెనక వసూళ్ల దందా ఉందని సంజయ్‌ ఆరోపించారు. మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల ఖర్చులకు తెలంగాణ నుంచి డబ్బులు పంపించాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్దేశించిందని.. అందుకోసమే ఈ దందా అని చెప్పారు. కబ్జాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వాళ్లవే ఎక్కువ భూములు ఉన్నాయని.. వారిద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఒక్కటవుతారని తెలిపారు. తనకు ఫాంహౌస్‌ లేదని, స్నేహితుడిది లీజుకు తీసుకున్నానంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌ స్పందించారు.


కేటీఆర్‌ అమాయకుడు.. పాపం నోట్లో వేలుపెడితే కూడా కొరకలేడని ఎద్దేవా చేశారు. తన ఫాంహౌ్‌సపై అక్రమంగా డ్రోన్‌ కెమెరాలతో ఫొటోలు తీయించారంటూ నాడు రేవంత్‌పై ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ సిద్ధాంతాలను నమ్మి సీఎం రేవంత్‌ సహా ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా సంజయ్‌ చెప్పారు. కాగా, ఎఫ్‌టీఎల్‌ నిబంధనల ఉల్లంఘించి నిర్మించిన 100 పైగా కట్టడాలను హైడ్రా కూల్చివేస్తే కేటీఆర్‌కు లేని ప్రేమ, ఆందోళన జన్వాడ ఫాంహౌస్‌ అంశంలో మాత్రం ఎందుకని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Aug 22 , 2024 | 03:24 AM