Share News

CM Revanth Reddy: స్కిల్‌ వర్సిటీని మీరే నడపాలి!

ABN , Publish Date - Sep 20 , 2024 | 03:48 AM

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలు, అధికారులకు పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: స్కిల్‌ వర్సిటీని మీరే నడపాలి!

మీ చేతుల్లో పెడుతున్నా.. మీ బ్రాండ్‌ వాల్యూను యూనివర్సిటీకీ తీసుకురావాలి

  • వర్సిటీ బోర్డు చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాతో సీఎం రేవంత్‌రెడ్డి

  • సచివాలయంలో బోర్డు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం

  • యూనివర్సిటీ కార్పస్‌కు సహకరించాలి

  • భవన నిర్మాణాల్లో భాగస్వాములు కావాలి

  • శిక్షణ పొందిన వాళ్లకు మీరే ఉద్యోగాలివ్వాలి

  • స్పోర్ట్స్‌ వర్సిటీకి బడ్జెట్లో వెయ్యి కోట్లు!: సీఎం

  • వచ్చే నెల నుంచే గచ్చిబౌలిలో స్కిల్‌ తరగతులు

  • హెల్త్‌ కేర్‌, లాజిస్టిక్స్‌, ఈ-కామర్స్‌లో కోర్సులు

  • 2 నుంచి కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు అర్హులైన వారందరికీ ఇవ్వాలి: సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలు, అధికారులకు పిలుపునిచ్చారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డు ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, కో చైర్మన్‌ శ్రీనిరాజు, బోర్డు సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీ్‌షరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి, ఇతర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పారిశ్రామికవేత్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న మహీంద్రా ఆనంద్‌ స్కిల్స్‌ యూనివర్సిటీకి తన బ్రాండ్‌ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణలోని పారిశ్రామికవేత్తలు స్కిల్స్‌ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి సహకరించాలని కోరారు.


దాతల పేర్లను లేదా వారి కంపెనీల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ లక్ష్యంగా.. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచే యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని చెప్పారు. 200 ఎకరాల్లో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ నెలకొల్పి.. 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ అభివృద్థిలోనూ పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని, రూ.3 లక్షల కోట్ల బడ్జెట్లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్థంగా ఉన్నామని చెప్పారు. ఆర్థిక సహకారానికి మించి, రాష్ట్రంలోని అందరు పారిశ్రామికవేత్తలు ఆశించినంత చొరవ ప్రదర్శించాలని.. తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.


డిగ్రీలు, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన లక్షల మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించండని తన వద్దకువస్తున్నారని ముఖ్యమంత్రి తనకు ఎదురైన కొన్ని అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఏటా లక్షల మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్నారని, అందరూ ఉద్యోగాలు సాధించలేక పోతున్నారని చెప్పారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు సరిపడే మానవ వనరుల కొరత ఉందని ప్రస్తావించారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకు స్కిల్‌ యూనివర్సిటీ నెలకొల్పాలనే ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందరికీ సరిపడేన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని, వివిధ రంగాలతో పాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉండదని చెప్పారు.


  • పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని చెప్పారు. ఇప్పటికే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్థమయ్యాయన్నారు. సీఎం ఆలోచనల మేరకు త్వరలోనే స్కిల్‌ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.

  • అందుకే ఒప్పుకున్నా: మహీంద్రా

తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. విజన్‌ ఉన్న సమర్థ నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అంటూ కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని సీఎం కోరగానే ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందని అభినందించారు. ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో సందేహం లేదన్నారు. సీఎం కల నిజం కావాలని, ఆయన ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు.


  • వచ్చే నెల నుంచే కోర్సులు

స్కిల్స్‌ యూనివర్సిటీ దసరా తర్వాత కోర్సులు ఈ ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ(ఈఎ్‌ససిఐ)లో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనుంది. హెల్త్‌ కేర్‌, ఈ-కామర్స్‌, లాజిస్టిక్స్‌ కోర్సులను ప్రారంభించనుంది. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతో పాటు ఏఐజీ, లెన్స్‌ కార్ట్‌, ఫ్లిఫ్‌ కార్ట్‌, అమెజాన్‌, ఆల్కార్గో, ప్రొ కనెక్ట్‌, ఓ9 సొల్యూషన్స్‌ కంపెనీలు ముందుకొచ్చాయి. తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.


కొత్త రేషన్‌ కార్డులకు 2 నుంచి దరఖాస్తులు తీసుకోండి

  • అర్హులకు డిజిటల్‌ రేషన్‌ కార్డులు: సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 2 నుంచి కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్‌ కార్డుల జారీకి విధి విధానాలపై గురువారం సమీక్ష జరిగింది. అర్హులైన వారందరికీ డిజిటల్‌ రేషన్‌ కార్డులు ఇచ్చే ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రెండు రోజుల్లో మరోసారి సమావేశమవుదామని సీఎం చెప్పారు.

Updated Date - Sep 20 , 2024 | 03:48 AM