Share News

Tummidihetti Barrage: తుమ్మిడిహెట్టిపై సర్కారు నజర్‌

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:40 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచీ వాదిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది.

Tummidihetti Barrage: తుమ్మిడిహెట్టిపై సర్కారు నజర్‌

  • వ్యాప్కోస్‌ నివేదిక పునః పరిశీలన దాని ఆధారంగా డీపీఆర్‌ తయారీ!

  • సుందిళ్లకు గ్రావిటీతో నీటికి కొత్త ప్లాన్‌? ఎన్‌డీఎస్‌ఏ నివేదిక అందిన తరువాతే కాళేశ్వరం బ్యారేజీలపై నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచీ వాదిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ క్రమంలో తుమ్మిడిహెట్టిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ గతంలో చేసిన సర్వే ఫలితాలను పునః పరిశీలన చేయించే పనిలో పడింది.


ఆ ఫలితాల ఆధారంగా డీపీఆర్‌కు తుదిరూపు ఇచ్చి, అనుమతుల కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో దాఖలు చేయనుంది.. గతంలో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రతిపాదించగా.. తాజాగా గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలించాలనే కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెరమీదకి తెచ్చింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతం నుంచి 71.5 కి.మీ. దాకా కాలువల నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. ఇక బ్యారేజీ నిర్మాణమే తరువాయి. అయితే బ్యారేజీ నిర్మాణం జరిగితే 71.5 కి.మీ. దూరం(మైలారం గ్రామం) దాకా మోటార్లు లేకుండా నీరు గ్రావిటీతో రానుంది.


అక్కడ నుంచి తక్కువ సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చని గతంలో ప్రతిపాదించారు. అయితే, తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంపించవచ్చని అధికారులు తాజాగా అభిప్రాయానికి వచ్చారు. మైలారం వద్ద పంప్‌హౌస్‌ కట్టి ఎల్లంపల్లిలో నీటిని ఎత్తిపోయాలా..? లేక సుందిళ్లకు గ్రావిటీతో తరలించి, దాని పైనే ఉన్న ఎల్లంపల్లికి ఎత్తిపోయాలా..? అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కట్టాలని ప్రతిపాదించగా.. ముంపు అధికంగా ఉంటుందనే మహారాష్ట్ర అభ్యంతరాలతో పక్కనపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 148 టీఎంసీలతోనే ప్రాజెక్టును కడతామని అప్పటి సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సతో సీఎం కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారు. దీనికి మహారాష్ట్ర అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసింది.


కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టిని కడతామని కేసీఆర్‌ ప్రకటించారు. తర్వాత తుమ్మిడిహెట్టి కాలగర్భంలో కలిసిపోయింది. వన్యప్రాణుల అభయారణ్యం, సాంకేతిక అంశాలు, నీటి లభ్యత లేదనే కారణాలతో ప్రాజెక్టును పక్కనబెట్టారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్వేలో తేల్చారు. అన్ని బేసిన్లలో జూన్‌ నుంచి నవంబరుదాకే వరద ఉంటుంది. ప్రాణహితలో ఫిబ్రవరిలో కూడా 10 వేల క్యూసెక్కుల దాకా ప్రవాహం ఉంటుంది.తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్య జాబితాలో పెట్టుకున్న ప్రభుత్వం అదే సమయంలో ఎన్‌డీఎ్‌సఏ తుది నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఆయా బ్యారేజీల పునరుద్ధరణ.. వాటిలో ఎంత నీటిని నిల్వ చేయాలి..? ప్రాజెక్టుల నిర్వహణ మ్యాన్యువల్స్‌.. తదితర అంశాల్లో ఎన్‌డీఎ్‌సఏ సూచనలను పాటించాలని భావిస్తోంది.

Updated Date - Aug 13 , 2024 | 03:40 AM