Share News

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీలను సందర్శించిన నిపుణుల కమిటీ

ABN , Publish Date - Jun 02 , 2024 | 03:02 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్‌ అనిల్‌కుమార్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ శనివారం సందర్శించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని జ్యుడీషియల్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయమందించేందుకు ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీలను సందర్శించిన నిపుణుల కమిటీ

  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పరిశీలన

  • వివిధ అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం

  • జ్యుడీషియల్‌ కమిషన్‌కు నివేదిక..!

మహదేవపూర్‌/కాటారం(మహదేపూర్‌రూరల్‌)/మంథని రూరల్‌, జూన్‌ 1: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్‌ అనిల్‌కుమార్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ శనివారం సందర్శించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని జ్యుడీషియల్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయమందించేందుకు ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలుత మేడిగడ్డ బ్యారేజీపైన బ్రిడ్జి కుంగిపోయిన ప్రాంతంతో పాటు బ్యారేజీ అప్‌, డౌన్‌ స్ట్రీమ్‌లలో దెబ్బతిన్న ప్రాంతాలు, మరమ్మతులను క్షుణ్ణంగా పరిశీలించింది. బ్లాక్‌-7లో కుంగిపోయి బాగా దెబ్బతిన్న పియర్స్‌ను, తెరుచుకోకుండా బిగుసుకుపోయిన గేట్లను, బ్యారేజీ ఆప్రాన్‌ను, పియర్స్‌ కింది నుంచి నీరు లీకేజీ అవుతున్న తీరును పరిశీలించింది.


నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) సూచనల మేరకు చేపడుతున్న మరమ్మతులను గమనించింది. బ్లాక్‌-7లో యంత్రాల సాయంతో తెరవడానికి ప్రయత్నించగా బిగుసుకుపోయిన గేట్ల కటింగ్‌, షీట్‌ ఫైల్స్‌ అమరిక, సీసీ బ్లాక్స్‌ పునరుద్ధరణ, డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ పనులను నిశితంగా పరిశీలించింది. అనంతరం బ్యారేజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి పలు విషయాలపై ఆరాతీశారు. అనంతరం అన్నారం బ్యారేజీని సందర్శించి.. అక్కడి సీపేజీలు, బుంగలతో దెబ్బతిన్న 28, 35, 38, 44 నంబర్ల పియర్స్‌ను సభ్యులు పరిశీలించారు.


బ్యారేజీ ప్రాంతమంతా కలియతిరిగి పలు అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సీసీ బ్లాక్‌ల పునరుద్ధరణ, గ్రౌటింగ్‌ కోసం చేపడుతున్న పనులను పరిశీలించారు. అక్కడి నుంచి సాయంత్రానికి సుందిళ్ల బ్యారేజీని చేరుకొని.. పరిశీలన జరిపారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ డౌన్‌ సీమ్‌ ప్రాంతంలో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ త్వరలో బ్యారేజీల సందర్శనకు రానున్న నేపఽథ్యంలో నిపుణుల కమిటీ జియో టెక్నికల్‌, జియాలజికల్‌ డేటాపై దృష్టి సారించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 02 , 2024 | 03:02 AM