Share News

Group-1: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:07 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఇంగ్లిష్‌ (క్వాలిఫై టెస్ట్‌) పరీక్ష, తర్వాత వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.

Group-1: నేటి నుంచి  గ్రూప్‌-1 మెయిన్స్‌

  • మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు

  • ఈ నెల 27వ తేదీ వరకు వరుసగా పరీక్షలు

  • 31,383 మంది అభ్యర్థులు, 46 పరీక్షా కేంద్రాలు

  • కేంద్రానికి కనీసం అరగంట ముందు వెళ్లాలి

  • అభ్యర్థులు అన్ని పరీక్షలూ రాయాల్సిందే

  • పటిష్ఠ బందోబస్తు.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఇంగ్లిష్‌ (క్వాలిఫై టెస్ట్‌) పరీక్ష, తర్వాత వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఒకపక్క ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 46 పరీక్షా కేంద్రాలు (హైదరాబాద్‌ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్‌ జిల్లాలో 27) ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షించనున్నారు.


పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా హాలు, చీఫ్‌ సూపరింటెండెంట్‌ రూమ్‌, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 12.30 నుంచి 1.30గంట వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే 040-23452185, 040-23452186, 040-23452187నంబర్లలో కానీ, ఈ-మెయిల్‌ ద్వారా కానీ సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.


దివ్యాంగులకు గంట సమయం అదనంగా కేటాయిస్తున్నారు. సహాయకులసాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, పరీక్షా హాళ్లలో గోడ గడియారాలు ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్స్‌లో అభ్యర్థులు అన్ని పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌, ప్రశ్నపత్రాలు భద్రపరచుకోవాల్సి ఉంటుంది. 563గ్రూపు-1 పోస్టులను భర్తీలో భాగంగా.. ఇప్పటికే ప్రిలిమనరీ పరీక్షలు పూర్తి చేసి, మెయిన్స్‌ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున అభ్యర్థులు మెయిన్స్‌ రాయనున్నారు.


గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌

పరీక్ష పేరు తేదీ

జనరల్‌ ఇంగ్లీషు (క్వాలిఫై టెస్ట్‌) 21-10-2024

పేపర్‌-1 జనరల్‌ ఎస్సే 22-10-2024

పేపర్‌-2 చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం 23-10-2024

పేపర్‌-3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పాలన 24-10-2024

పేపర్‌-4 ఆర్థిక శాస్త్రం, అభివృద్ధి 25-10-2024

పేపర్‌-5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 26-10-2024

పేపర్‌-6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 27-10-2024

Updated Date - Oct 21 , 2024 | 03:07 AM