Share News

Harish Rao: పార్టీని నడుపుతున్నారా? లేక సర్కస్సా?

ABN , Publish Date - Sep 16 , 2024 | 02:56 AM

ఒకే అంశంపై ముఖ్యమంత్రి ఓ మాట, మంత్రులు మరో మాట్లాడుతుండడం చూస్తుంటే.. రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో పార్టీ నడుపుతున్నారా? లేదా సర్కస్‌ నడుపుతున్నారా? అనే సందేహం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: పార్టీని నడుపుతున్నారా? లేక సర్కస్సా?

  • సన్నాసి, లిల్లీపుట్‌ అని అనలేనా?

  • రేవంత్‌ పదవిలో ఉండేది ఐదేళ్లే

  • పార్టీ నడుపుతున్నారా? సర్కస్సా?

  • ఒకే అంశంపై ముఖ్యమంత్రి, మంత్రులది తలో మాట

  • నా ఎత్తును పదేపదే విమర్శిస్తే.. నేను లిల్లీపుట్‌ అనలేనా

  • సీఎం రేవంత్‌పై హరీశ్‌ రావు ధ్వజం

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఒకే అంశంపై ముఖ్యమంత్రి ఓ మాట, మంత్రులు మరో మాట్లాడుతుండడం చూస్తుంటే.. రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో పార్టీ నడుపుతున్నారా? లేదా సర్కస్‌ నడుపుతున్నారా? అనే సందేహం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌ గాంధీ భవన్‌లో మాట్లాడిన మాటలు, ఉపయోగించిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న గౌరవాన్ని రేవంత్‌ తగ్గిస్తున్నారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మా వాళ్లే కౌశిక్‌ రెడ్డి ఇంటికెళ్లారని ఓ పక్క ముఖ్యమంత్రి, గాంధీకి తమకు సంబంధం లేదని, ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గొడవని మంత్రి శ్రీధర్‌బాబు మరోపక్క అనడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.


వర్షాల వల్ల వచ్చిన బురదకు తోడు ముఖ్యమంత్రి అసత్యాల వరదతోనూ రాష్ట్ర ప్రజలు తిప్పలు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నామని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామనే ఇంగితం లేకుండా రేవంత్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌ పదే పదే తన ఎత్తు గురించి దుర్భాషలాడుతున్నారని వాపోయిన హరీశ్‌.. తెలంగాణ ఉద్యమం తనని మరింత ఎత్తుకు చేర్చిందని చెప్పారు. ఆత్మనూన్యత భావం వల్లే రేవంత్‌ ఎత్తు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. తాను తాటిచెట్టంత ఎదిగినా రేవంత్‌ వెంపలి చెట్టంత కూడా ఎదగలేదని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ మర్యాద ఇచ్చామని, ముఖ్యమంత్రిని సన్నాసి, లిల్లీపుట్‌ అని తాము అనలేమా అని ప్రశ్నించారు.


హరీశ్‌ రావు ఎక్కడ దాక్కున్నాడని సీఎం ప్రశ్నించారని తాను రేవంత్‌ గుండెల్లోనే నిద్రపోయానని ఎద్దేవా చేశారు. అదృష్టం కొద్దీ సీఎం అయిన రేవంత్‌ ఆ పదవిలో ఉండేది ఐదేళ్లేనని, కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలోనూ ఐదేళ్లకు మించి అధికారంలో లేదన్నారు. గాంధీభవన్‌లో సీఎం చెప్పినవన్నీ అబద్ధాలేనని, రుణ మాఫీ అమలు కాలేదనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందా? అనే అంశంపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. వానాకాలం రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఇక, ఫార్మాసిటీ కోసం రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం 12 వేల ఎకరాలు సేకరిస్తే.. సీఎం రేవంత్‌ అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Sep 16 , 2024 | 02:56 AM