Share News

Harish Rao: ఈ కష్టాలకు కారణం.. ప్రభుత్వ నిర్లక్ష్యమే

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:24 AM

కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: ఈ కష్టాలకు కారణం.. ప్రభుత్వ నిర్లక్ష్యమే

  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులున్నా వినియోగించట్లే

  • సీఎంకు వ్యంగ్యం తప్ప.. పాలన తెల్వదు

  • వరద బాధితులకు విరాళంగా బీఆర్‌ఎస్‌

  • ప్రజాప్రతినిధుల నెల వేతనం: హరీశ్‌రావు

హైదరాబాద్‌/సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.1345.15 కోట్లున్నా.. వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. వరద ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు కేంద్రానికి స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వలేదని తప్పుబట్టారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖతో ఈ విషయం బట్టబయలైందన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను, అమర్‌నాథ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.


ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. విపత్తుల నిర్వహణకు కేంద్రం ఎస్‌ఆర్‌డీపీ కింద విడుదల చేసిన నిధులు రూ.208 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జూన్‌ నెలలోనే జమ అయ్యాయని, ఈ నిధులను వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్రానికి యుటిలైజేషన్‌ లెటర్‌ ఇచ్చే సోయి లేకపోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యపు పోకడలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యంగ్యం తప్ప.. పరిపాలన వ్యవహారం లేదని ఎద్దేవా చేశారు. ఆపదలో వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ దాడులకు పాల్పడిందని మండిపడ్డారు.


రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, పాలు నీళ్లు ప్రజలే తెలుస్తారని వాఖ్యానించారు. సిద్దిపేటలో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కళాశాలను ప్రభుత్వం కొడంగల్‌కు తరలించుకుపోయిందని విమర్శించారు. భారీ వర్షం, వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్‌ సూచన మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


వరద బాధితులు అత్యంత దయనీయ, విషాదకరమైన స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి కూడా లేకుండా ఎంతో మంది వరద బాధితులు చిన్న, పెద్ద, వృద్ధుు బిల్డింగ్‌ల పైకెక్కి ఎదురుచూస్తున్నారని తెలిపారు. వారి కోసం గురువారం ఉదయం సిద్దిపేట నుంచి 6 లారీల్లో ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంపించనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట మునిసిపల్‌ కౌన్సిలర్లు కూడా నెల వేతనాన్ని అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. సిద్దిపేట అమర్‌నాథ్‌ సేవా సమితి, కేదార్‌నాథ్‌ సేవా సమితి, సిద్దిపేట ఐఎంఎ అసోసియేషన్‌ వైద్యులు సహకారం అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

Updated Date - Sep 05 , 2024 | 03:24 AM