T. Harish Rao: పీఏసీ చైర్మన్గా హరీశ్రావు?
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:58 AM
శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి.
కమిటీకి మూడు పేర్లు ఇచ్చిన బీఆర్ఎస్
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి. శుక్రవారంనాటి శాసనసభలో పీఏసీ, అంచనాల కమిటీల్లో నియమించేందుకు ఆయా పార్టీలు పేర్లను సూచించాల్సిందిగా స్పీకర్ ప్రసాద్కుమార్ కోరారు.
స్పీకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ పార్టీలు రెండు కమిటీలకు తమ ప్రతిపాదనలు అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చాయి. అయితే పీఏసీకి హరీశ్రావు, గంగుల కమలాకర్లతోపాటు మరో ఎమ్మెల్యే పేరును బీఆర్ఎస్ ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం సూచించిన పేర్ల నుంచి ఒకరిని పీఏసీ చైర్మన్గా ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈమేరకు పీఏసీ చైర్మన్గా హరీశ్రావును ఎంపిక చేసే అవకాశాలున్నాయి.