Share News

Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:38 AM

మురుగుతో నిండిపోయిన, అసలు నీళ్లే లేని చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు? అని బెంగళూరుకు చెందిన లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఆనంద్‌ మల్లిగవాడ్‌ను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అడిగి తెలుసుకున్నారు.

Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

  • పొరుగు రాష్ట్రానికి వెళ్లి పరిశీలించనున్న హైడ్రా

  • 35 నీటి వనరుల పునరుద్ధరణ విధానంపై ఆరా

  • లేక్‌ మ్యాన్‌ మల్లిగవాడ్‌తో రంగనాథ్‌ సమావేశం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మురుగుతో నిండిపోయిన, అసలు నీళ్లే లేని చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు? అని బెంగళూరుకు చెందిన లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఆనంద్‌ మల్లిగవాడ్‌ను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అడిగి తెలుసుకున్నారు. గురువారం ఆయనతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. బెంగళూరులో స్వల్ప ఖర్చుతో 35 చెరువులను బాగు చేసిన తీరును ఆనంద్‌ పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి స్వచ్ఛమైన నీరు చేరే ఏర్పాట్లు, మురుగు కాల్వల నుంచే శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి.. చెరువులోకి చేరే వరకు మూడు, నాలుగు దశల్లో నీరు ఉంచి శుద్ధి చేసిన తీరుపై హైడ్రా దృష్టిసారిస్తోందని రంగనాథ్‌ తెలిపారు.


మురుగు కాల్వలకు ఇరువైపులా మొక్కలు నాటడం, చెరువుకు చేరేలోపే కొంత శుద్ధి అయ్యేలా చేయడంపై అధ్యయనం చేస్తామన్నారు. బెంగళూరు వెళ్లి చెరువులను పరిశీలించే ఆలోచన ఉందని చెప్పారు. ఆనంద్‌ మల్లిగవాడ్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్ధరణపై సహాయ సహకారాలను కోరుతామని కమిషనర్‌ తెలిపారు. సున్నం చెరువు, అప్పాచెరువు, ప్రగతినగర్‌ ఎర్రకుంట, కూకట్‌పల్లి చెరువుల్లో కూల్చివేతల వ్యర్థాలను తొలగిస్తామన్నారు. చెరువుల పరిసరాల్లో నివిసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి పునరుద్ధరిస్తామన్నారు.

Updated Date - Oct 11 , 2024 | 04:38 AM