Share News

Hyderabad: వాన.. వరదై.. వాహనాలను ముంచేసి..

ABN , Publish Date - Aug 20 , 2024 | 05:00 AM

ప్రధాన రోడ్లు ఉన్నట్టుండి చెరువుల్లా మారిపోతే? పోటెత్తుతున్న కాలువలను తలపిస్తే? హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం కొన్నిచోట్ల వాహనదారులకు ఇలాంటి అనుభవం ఎదురైంది.

Hyderabad: వాన.. వరదై.. వాహనాలను ముంచేసి..

  • హైదరాబాద్‌లో 2 గంటలపాటు కుండపోత

  • మునిగిన కార్లు.. కొట్టుకెళ్లిన బైక్‌లు

  • గంటలకొద్దీ ట్రాఫిక్‌ జాం.. ప్రజల తిప్పలు

  • విమానాశ్రయం టెర్మినల్‌లోకి నీరు

  • రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షం

  • నిజామాబాద్‌లో వరదలో ఆర్టీసీ బస్సు

  • భీంగల్‌లో 10.6 సెం.మీ వర్షపాతం

  • వేర్వేరు చోట్ల పిడుగుపడి ఇద్దరి మృతి

  • మరో రెండు రోజుల పాటు వర్షాలే!

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌): ప్రధాన రోడ్లు ఉన్నట్టుండి చెరువుల్లా మారిపోతే? పోటెత్తుతున్న కాలువలను తలపిస్తే? హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం కొన్నిచోట్ల వాహనదారులకు ఇలాంటి అనుభవం ఎదురైంది. అప్పటిదాకా రయ్యిన దూసుకెళ్లిన కార్లు, బైక్‌లు.. కుండపోత వర్షంతో ముందుకు కదిలేందుకు మొరాయించాయి! కొద్దిసేపటికే.. వరద పోటెత్తడంతో ఆ నీళ్లలో బైక్‌లు కొట్టుకుపోయాయి! కార్లు మునిగిపోయాయి. లోపల చిక్కుకున్నవారిని స్థానికులు బయటకు తీయాల్సి వచ్చిందంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు!! గతంలో ఎన్నడూలేని విధంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది.


సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో రెండు గంటల పాటు కుండపోత వర్షం పడింది. వరద ఉధృతికి టోలిచౌకీ, సికింద్రాబాద్‌, షేక్‌పేట నాలా, యూసు్‌ఫగూడ శ్రీకృష్ణానగర్‌, ఫిలింనగర్‌ దీన్‌దయాళ్‌నగర్‌ ప్రాంతాల్లో రోడ్లపై పార్క్‌ చేసిన వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. టోలిచౌకీ గెలాక్సీ వద్ద వరదనీరు ముంచేయడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నీటమునిగి.. కదల్లేకపోయాయి. కొన్ని కొట్టుకుపోయాయి. కార్లు సగం దాకా మునిగి అతికష్టమ్మీద లోపలున్న వారు బయట పడ్డారు. రోడ్లపై వరద నీరు చేరడంతో పలుచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కుత్బుల్లాపూర్‌ వెంకన్నహిల్స్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరింది.


నాలాలు, మ్యాన్‌ హోళ్లు పొంగి.. మురుగునీరు రోడ్లపైకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్‌పేటలో 5.3 సెం.మీ, యూసు్‌ఫగూడలో 5.2, గచ్చిబౌలిలో 5.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలుప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. సోమవారం పలు జిల్లాల్లో వర్షం పడింది. నిజామాబాద్‌లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నగరంలోని రైల్వే కమాన్‌ అండర్‌బ్రిడ్జి వద్దకు భారీగా వరద పోటెత్తడంతో ఓ ఆర్టీసీ బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. లోపల 40మంది దాకా ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ట్రాఫిక్‌ పోలీసులొచ్చి.. స్థానికుల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లాలోని భీంగల్‌లో 10.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా పరిఽధిలోని మరో నాలుగు మండలాల్లో 5సెం.మీ పైచిలుకు వర్ష పాతం నమోదవ్వడం గమనార్హం. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో 10.6 సెం.మీ, నల్లగొండ జిల్లా గుర్రంపోడులో 9.5 సెం.మీ, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 7 సెం.మీ, ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో 5.1 సెం.మీ, సిరిసిల్ల జిల్లా గంభీర్‌రావు పేటలో 6.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.


  • పిడుగుపాటుకు ఇద్దరి మృతి

పిడుగులు పడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మృతిచెందారు. పొలంలో పెసరకాయ ఏరుతుండగా పిడుగుపడటంతో వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం సంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు కార్తీక్‌ మృతిచెందాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పిడుగుపడటంతో మంచిర్యాల జిల్లా భీమిని మండలం బిట్టూరుపల్లి గ్రామానికి చెందిన జక్కుల భాస్కర్‌ (56) మృతి చెందాడు.


  • మరో రెండ్రోజులు వర్షాలే

రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నిజామాబాద్‌, కరీంనగర్‌, హన్మకొండ, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, గద్వాల, నారాయణ్‌పేట జిల్లాలో, ఈనెల 21న కామారెడ్డి, నిజామాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.


  • సాగర్‌ గేట్ల మూసివేత

కృష్ణా పరిధిలో వరద తగ్గడంతో నాగార్జునసాగర్‌ గేట్లు మూసివేశారు. సాగర్‌కు 14 రోజుల్లో 200 టీఎంసీల వరద వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 96,811 క్యూసెక్కుల వరద వస్తోంది. 37,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195.21 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టమైన 45.77 టీఎంసీలకు చేరుకుంది.


ఎగువ నుంచి 16వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి పరిధిలోని మేడిగడ్డకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 2.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతేనీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 3.1 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఎల్లపంల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌ మానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.

Updated Date - Aug 20 , 2024 | 05:00 AM