Share News

Hyderabad: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష సజావుగా జరిగేలా చూడండి

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:11 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఈ నెల 9న నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

Hyderabad: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష సజావుగా జరిగేలా చూడండి

  • పాఠశాలలు ప్రారంభించేనాటికి విద్యార్థులకు యూనిఫాం అందాలి

  • ఎరువులు సక్రమంగా అందేలా చూడాలి

  • కలెక్టర్లకు సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఈ నెల 9న నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ప్రిలిమినరీ పరీక్షతోపాటు విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్‌ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై గురువారం సచివాలయం నుంచి ఆమె జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరకానున్నారన్నారు. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతోపాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామని చెప్పారు.


ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్‌ కో-ఆర్డినేటరును నియమించామన్నారు. సీఎస్‌ శాంతికుమారి మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్లకు కూడా పరీక్షల ఏర్పాట్లపై తగిన ఆదేశాలు జారీ చేశామని, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందన్నారు. బ్లాక్‌ మార్కెటింగ్‌, విత్తనాల నిల్వలను అరికట్టడంలో తగు చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను అభినందించారు. రాబోయే మూడు వారాలు ఇదే నిఘాను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సీజన్‌ ముగిసే వరకు విత్తనాలు కొన్న బిల్లులను రైతులు భద్రపర్చుకునేలా చూడాలని చెప్పారు. ఎరువుల తరలింపును పర్యవేక్షించి, సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఉందా లేదా అనే దానిపై నిర్ణీత గడువులోగా సర్వే చేయాలన్నారు. జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభించేనాటికి ఒక జత స్కూల్‌ యూనిఫాం చొప్పున విద్యార్థులకు అందేలా చూడాలని చెప్పారు.

Updated Date - Jun 07 , 2024 | 03:11 AM