Share News

Khammam: తెలంగాణ నుంచి మరిన్ని కథలు రావాలి

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:32 AM

తెలంగాణ ప్రాంతం నుంచి మరింత విరివిగా కథా సాహిత్యం రావాల్సి ఉందని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ ఆకాంక్షించారు.

Khammam: తెలంగాణ నుంచి మరిన్ని కథలు రావాలి

  • ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌

  • కథ-2023 సంకలనం ఆవిష్కరణ

  • కథ కాల స్థితిగతులను రికార్డు చేస్తుంది: ప్రముఖ కవి శివారెడ్డి

  • అమెరికా తరువాత తెలుగులోనే కథా సంకలనాల సిరీస్‌: వాసిరెడ్డి

ఖమ్మం సాంస్కృతికం, అక్టోబరు 6: తెలంగాణ ప్రాంతం నుంచి మరింత విరివిగా కథా సాహిత్యం రావాల్సి ఉందని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ ఆకాంక్షించారు. వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ సంపాదకత్వంలో వెలువడిన కథ-2023 సంకలనాన్ని ఆయన ఆదివారం ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ప్రముఖ కవి కె.శివారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కవి, విద్యావేత్త రవి మారుత్‌ అధ్యక్షతన జరిగిన సభలో కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి కఽథకులు, కథలు వస్తున్నా ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆ సంఖ్య కొంత తక్కువగానే ఉందన్నారు. సంకలనాల ప్రచురణకర్తలు ప్రాంతాల సమతుల్యాన్ని పాటిస్తే మంచిదన్నారు. సమాజంలో వస్తున్న అనేక మార్పులను కథకులు తమ వస్తువులుగా ఎంచుకుంటుండటంతో కథ భవిష్యత్‌ తరాలకు చరిత్ర అవుతుందన్నారు.


కథా సంకలనాల్లో ప్రాంతీయ సమతుల్యం లేకపోతే ఈ ప్రాంతంలో మంచి కథకులు, కథలు లేవన్న అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. 1910ల్లోనే తెలంగాణ ప్రాంతం నుంచి కథలు వచ్చాయని, 1917 వరకు విస్తృతి పెరిగి వందల కథలు వచ్చాయన్నారు. కథా సంకలనం సిరీ్‌సను గత 34 ఏళ్లుగా నిరాటంకంగా నిర్వహిస్తుండటం సాధారణ విషయం కాదన్నారు. కథ కాల స్థితి గతులను రికార్డు చేస్తుందని కే శివారెడ్డి అన్నారు. ప్రపంచంలో ఏ మార్పులు సంభవిస్తున్నాయో కథకులు తమ కథల్లో రికార్డు చేస్తున్నారని చెప్పారు. వాసిరెడ్డి నవీన్‌ మాట్లాడుతూ ‘షార్ట్‌ స్టోరీస్‌’ పేరుతో అమెరికాలో 1915లో మొదలైన సిరీస్‌ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. అమెరికా తరువాత తెలుగులోనే కథా సంకలనాల సిరీస్‌ వస్తోందన్నారు. పాపినేని శివశంకర్‌ మాట్లాడుతూ కథల ఎంపికలో తాము ప్రాంత, వర్గ, కుల భేదాలు చూడబోమన్నారు. ప్రముఖ సాహితీవేత్త మువ్వా శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఈ కథలను ప్రముఖ విశ్లేషకురాలు పీ జ్యోతి పరిచయం చేశారు.

Updated Date - Oct 07 , 2024 | 04:32 AM