Share News

Hyderabad: రాష్ట్రంలో మళ్లీ భూమ్‌..

ABN , Publish Date - May 17 , 2024 | 04:21 AM

రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌, మైనింగ్‌ విభాగాల అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.

Hyderabad: రాష్ట్రంలో మళ్లీ భూమ్‌..
CM Revanth Reddy

  • రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువల సవరణ

  • రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీలు కూడా.. అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు

  • చార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశం.. సమన్వయంతో ఆదాయం పెంచాలి

  • ఎగవేతలు, అవినీతి, అక్రమాలకు చెక్‌ చెప్పాలి.. సామాన్యులకు ఇసుక కొరత రావొద్దు

  • రాబడుల శాఖల అధికారులతో సమీక్ష.. నిరుడు ఆశాజనకంగా లేదని అసంతృప్తి

తెలంగాణలో భూముల మార్కెట్‌ విలువలను మరోసారి సవరించనున్నారు. వాటితోపాటే రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీలను కూడా సవరించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఇందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్దేశించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేతలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌, మైనింగ్‌ విభాగాల అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు. చాలాచోట్ల భూముల మార్కెట్‌ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే, ‘‘గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచింది.


ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్‌ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉంది. నిబంధనల ప్రకారం ఏటా భూముల మార్కెట్‌ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టండి’’ అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడెక్కడ, ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలో.. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు... ఇలా వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, ఈ విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనలను పక్కాగా పాటించాలని నిర్దేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతోపాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్‌ ధరల సవరణ జరగాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర స్టాంప్‌ డ్యూటీ ఎంత ఉందో పరిశీలించాలని, దీనిని తగ్గించాలా.. పెంచాలా.. అనే దానిని అధ్యయనం చేయాలని ఆదేశించారు. సామాన్యులకు, చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని, ఇసుక ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు.


గత ఏడాది ఆదాయం ఆశాజనకంగా లేదు..

గతేడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలంటూ అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్‌లో పొందుపర్చిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏనెలకానెలా టార్గెట్‌ను నిర్దేశించుకుని రాబడిని సాధించేందుకు కృషి చేయాలని నిర్దేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబ డి తెచ్చి పెట్టే జీఎస్టీలో ఎగవేతలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు పక్కాగా ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌, ఆడిటింగ్‌ జరగాలని, జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని తేల్చి చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కారాదని, జీఎస్టీ రిటర్న్స్‌ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి, అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్‌లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినా.. లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణా, పన్ను ఎగవేతలు లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని, శాఖాపరమైన లొసుగులు లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికీ చాలాచోట్ల కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్లు చెట్ల కింద నిలబడే ఉంటున్నారనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. దాంతో, ప్రజోపయోగాని కి సేకరించిన స్థలాలను గుర్తించి.. వాటిలో కొన్నిచోట్ల అధునాతనంగా మోడల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనాలను నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సీఎం చెప్పారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 08:26 AM