Share News

T. Jaggaredy: ఐటీఐఆర్‌ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా..

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:51 AM

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేసే వరకూ దానిపై మాట్లాడుతూనే ఉంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం ఇస్తానని,

T. Jaggaredy: ఐటీఐఆర్‌ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా..

  • కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లను కలుస్తా

  • ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తాం

  • కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ మంజూరు చేసినప్పుడు.. రఘునందన్‌ రావు బీఆర్‌ఎ్‌సలో ఉన్నడు

  • నాకష్టంతోనే నేను ఎదిగా: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేసే వరకూ దానిపై మాట్లాడుతూనే ఉంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం ఇస్తానని, రద్దయిన ఐటీఐఆర్‌ను తిరిగి తీసుకురావాలని కోరతానని వెల్లడించారు. ప్రతిపక్షం తరఫున తమ బాధ్యత నిర్వర్తిస్తామని వెల్లడించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు కాంగ్రె్‌సకు వచ్చుంటే.. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేందుకు అవకాశం ఉండేదేమోనన్నారు. అప్పుడు తామంతా రాహుల్‌ దగ్గర కూర్చుని హైదరాబాద్‌కు తిరిగి ఐటీఐఆర్‌ను మంజూరు చేయించుకుని ఉండేవాళ్లమని పేర్కొన్నారు.


హైదరాబాద్‌కు సోనియా, మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ను మోదీ ప్రభుత్వం రద్దు చేయకుండా ఉంటే రాష్ట్రంలోని యువతకు ఈ పదేళ్లలో సుమారు 15లక్షల ఉద్యోగాలు వచ్చుండేవన్నారు. ఆ ప్రాజెక్టు అమలై ఉంటే సెజ్‌లు, ఇండస్ట్రియల్‌ పార్కులు, ట్రేడ్‌, వేర్‌ హౌస్‌ జోన్లు, ఎక్స్‌పోర్టు ఓరియెంటెడ్‌ యూనిట్లు హైదరాబాద్‌లో విస్తరించి ఉండేవని పేర్కొన్నారు. ప్రభుత్వానికీ పెద్ద ఎత్తున ఆదా యం సమకూరి ఉండేదన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టును ఎన్డీయే ప్రభుత్వం నిలిపేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన 8మంది బీజేపీ ఎంపీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐటీఐఆర్‌ను తిరిగి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు.


నా కష్టంమ్మీద నేను ఎదిగా

‘‘ఐటీఐఆర్‌ గురించి నాకు అఆలు కూడా తెలియవని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అంటున్నారు. ఎడ్యుకేషన్‌పరంగా నేను వీక్‌ అయుండొచ్చు. ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాను కూడా. రఘునందన్‌రావు పుస్తకాలు చదివితే.. నేను జీవితాన్ని చదివిన. పుస్తకాల్లో ఎవరో రాసింది ఉంటది. మెరిట్‌ స్టూడెంట్‌కు అనుభవాలు ఉండవు. జీవితాన్ని చదివిన వాడికి కష్టాలు, అనుభవాలు ఉంటయి’’ అని జగ్గారెడ్డి అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిండంటూ తనపై రఘునందన్‌రావు విమర్శలు చేస్తుండని, కానీ ఇక్కడ తల్లి పాత్రే తనదన్న సంగతి ఆయన తెలుసుకోవాలన్నారు. తన చిన్నతనంలో తమ దగ్గర ఆరెస్సెస్‌ శాఖలు నడుస్తుంటే.. పిల్లలమైన తాము గంట సేపు ఆడుకుని ప్రచారక్‌లు ఏదో చెబితే విని వస్తుండేవాళ్లమని చెప్పారు.


రఘునందన్‌రావు బీజేపీలోకి డైరెక్టుగా వచ్చిండు కాబట్టి ఆ శాఖల గురించి ఆయనకు తెలియదన్నారు. ఐటీఐఆర్‌ మంజూరు చేసినప్పుడు ఆయన బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నారన్నారు. తన కష్టం మీద, తన తల్లి ప్రోత్సాహంతో తాను ఎదిగానని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి జైలుకూ వెళ్లానన్నారు. తన జోలికి వస్తే బీజేపీలో ఉండే కుళ్లు, కుతంత్రాలు చర్చకు పెడతానని హెచ్చరించారు.

Updated Date - Jun 27 , 2024 | 04:51 AM