Share News

DGP Dr. Jitendar: డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం..

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:32 AM

తెలంగాణలో డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ వెల్లడించారు. బుధవారం ఆయన తెలంగాణ రాష్ట్ర ఐదో డీజీపీగా బాధ్యతలను చేపట్టాక.. ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

DGP Dr. Jitendar: డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం..

  • మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా

  • ప్రస్తుతం శాంతిభద్రతల్లో కొంత లోపం

  • అధికారులతో సమీక్షించి సరిదిద్దుకుంటాం

  • ఠాణాల్లో సివిల్‌ పంచాయితీలు సహించం

  • ‘ఆంధ్రజ్యోతి’తో డీజీపీ జితేందర్‌

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ వెల్లడించారు. బుధవారం ఆయన తెలంగాణ రాష్ట్ర ఐదో డీజీపీగా బాధ్యతలను చేపట్టాక.. ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డ్రగ్స్‌, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు తెలంగాణలో స్థానం లేకుండా చేస్తాం. సైబర్‌ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటాం’’ అని ఉద్ఘాటించారు. ప్రస్తుతం శాంతిభద్రతల్లో కొంత లోపాలున్నట్లు కనిపిస్తున్నా.. వాటిపై అధికారులతో సమీక్షించి, సరిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల్లేవని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఘటనల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పలు అంశాలపై మాట్లాడారు.


రాష్ట్రంలో వరుస ఘటనలను చూస్తుంటే.. శాంతిభద్రతలు అదుపు తప్పాయనిపిస్తున్నాయి కదా?

జితేందర్‌: ఇందులో కొంత వరకు వాస్తవం ఉంది. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి, శాంతిభద్రతలను గాడిలో పెట్టేలా చర్యలు తీసుకుంటాం. దీంతోపాటు.. మహిళాభద్రత, చిన్నారుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కచ్చితమైన విజన్‌తో ఉంది. రాష్ట్రంలో పోలీసుల పనితీరు మెరుగ్గానే ఉంది. ఒకట్రెండు ఘటనలు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. వాటితో ప్రజల్లో ఏర్పడిన దురభిప్రాయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.


డ్రగ్స్‌, గంజాయి కట్టడికి చేపట్టే చర్యలేంటి?

జితేందర్‌: మూలాల నుంచి డ్రగ్స్‌ను కట్టడి చేయాలని నిర్ణయించాం. నిఘా కొనసాగుతోంది. నిందితులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. సైబర్‌ నేరాల కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. సైబర్‌ నేరాలపై టోల్‌ఫ్రీ నం.1930కి ఫిర్యాదులు వచ్చిన వెంటనే.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన నగదును ఫ్రీజ్‌ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నాం.


అధికారులు ఎవరికివారే అన్నట్లు ఉన్నారనే ఆరోపణలున్నాయి కదా?

జితేందర్‌: అలాంటిదేమీ లేదు. ఎవరి విషయంలోనైనా గ్యాప్‌ ఉంటే.. సరిదిద్దుకుంటాం.

ప్రజలకు పోలీసులు దూరం అయ్యారనే

అపవాదును ఎలా తొలగిస్తారు?

జితేందర్‌: ప్రజలను గౌరవించాలని, బాధితులకు అండగా ఉండాలని సీఎం చెప్పారు. ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటారు.

ఠాణాల్లో సివిల్‌ పంచాయితీలపై ఏమంటారు?

జితేందర్‌: ఠాణాల్లో సివిల్‌ పంచాయితీలను సహించేది లేదు. అలాంటి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. కొన్ని ఠాణాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బందిని మార్చడంపై నిర్ణయాలు తీసుకుంటాం.

డయల్‌-100 సేవల్లో తీవ్ర జాప్యముందన్న ఆరోపణలపై మీరేమంటారు ?


జితేందర్‌: డయల్‌-100కు సమాచారం అందిన నిమిషాల్లోనే పోలీసులు స్పాట్‌కు చేరుకుంటున్నారు. అక్కడక్కడ ఆలస్యం, ఫలితంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన విషయం పరిశీలనలో ఉంది. సేవలపై సమీక్షిస్తాం.

హత్యలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి కదా?

జితేందర్‌: హత్యలకు అనేక కారణాలుంటున్నాయి. ప్రజలకు భద్రత కల్పిస్తాం. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం.

డీజీపీగా మీ ముందు ఉన్న సవాళ్లు ఏమిటి?

జితేందర్‌: నేరాల నియంత్రణ, శాంతి భద్రతల

నిర్వహణ ప్రధాన లక్ష్యాలు.

Updated Date - Jul 11 , 2024 | 03:34 AM