Share News

Hyderabad: వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలు ఎవరికో?

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:15 AM

రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంత మంది సీనియర్‌ ఐఏఎ్‌సలకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. కలెక్టర్లుగా ఉండి, బదిలీ అయిన 10 మంది ఐఏఎస్‌ అధికారులకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

Hyderabad: వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలు ఎవరికో?

  • సునీల్‌ శర్మ పదవీ విరమణతో ఖాళీగా ముఖ్య కార్యదర్శి పోస్టు

  • సమర్థుడైన అధికారిని నియమించే ఆలోచనలో సర్కారు

  • రాష్ట్రంలో మరికొందరు ఐఏఎ్‌సల బదిలీలపైనా కసరత్తు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంత మంది సీనియర్‌ ఐఏఎ్‌సలకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. కలెక్టర్లుగా ఉండి, బదిలీ అయిన 10 మంది ఐఏఎస్‌ అధికారులకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం వీరంతా వెయిటింగ్‌లో ఉన్నారు. వీపీ గౌతమ్‌, పి.ఉదయ్‌కుమార్‌, పమేలా సత్పతి, భవేశ్‌ మిశ్రా, యాస్మిన్‌ బాషా, జి.రవి, హరిచందన దాసరి, ఎస్‌.వెంకటరావు, ఇలా త్రిపాఠి, ఆల ప్రియాంకలకు పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీరితో పాటు కొంత మంది సీనియర్‌ అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.


బీఆర్‌ఎస్‌ హయాంలో నియమితులై, ఇప్పటికీ కొనసాగుతున్నవారు, ఒకే పోస్టులో దీర్ఘకాలికంగా ఉన్నవారిని బదిలీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అత్యంత కీలకమైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖలకు ముఖ్య కార్యదర్శి లేరు. ఇప్పటివరకు ఈ రెండు శాఖలకు కలిపి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్‌ శర్మ మే 31న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. కనీసం అదనపు బాధ్యతలను కూడా ఎవరికీ అప్పగించలేదు. ఈ బాధ్యతల కోసం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్‌ రెవెన్యూ శాఖతో పాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల అదనపు బాధ్యతలను కూడా చూశారు.


అదే మాదిరిగా తనకూ అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వ పెద్దలతో నవీన్‌ మాట్లాడుతున్నారని తెలిసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా కూడా ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో రాబడి ఎక్కువగా ఉండే ఈ రెండు శాఖలకు సమర్థుడైన అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. దీంతో ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. సమర్థుడైన సీనియర్‌ అధికారిని నియమించడంపై దృష్టి పెట్టింది.


ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌, అదనపు సీఈవో లోకేశ్‌కుమార్‌, సంయుక్త సీఈవో సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌లను కూడా ప్రభుత్వంలోకి తీసుకోవాలని యోచిస్తోంది. వీరికి ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వాలి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరిని ప్రతిపాదించాలన్న అంశంపైనా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అధికారులకు సంబంధించిన రహస్య నివేదికలు, ఇంటెలిజెన్స్‌ రిపోర్టులను తెప్పించుకుని పరిశీలిస్తోంది. త్వరలో ఐఏఎ్‌సల బదిలీలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటోంది.

Updated Date - Jun 18 , 2024 | 03:15 AM