Service Extension: కొత్త ఏఈఈలు వచ్చేదాకా 34 మందిసర్వీసుల కొనసాగింపు
ABN , Publish Date - Aug 09 , 2024 | 03:24 AM
నీటి పారుదల శాఖలో టీజీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ) నియామక ప్రక్రియ చేపడుతుండటంతో వారు సర్వీసులో చేరేదాకా వివిధ శ్రేణుల్లో పనిచేస్తున్న 34 మంది ఉద్యోగుల సర్వీసును కొనసాగించాలని సంబంధిత శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
నీటిపారుదల శాఖ ఉత్తర్వులు
నీటి పారుదల శాఖలో టీజీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ) నియామక ప్రక్రియ చేపడుతుండటంతో వారు సర్వీసులో చేరేదాకా వివిధ శ్రేణుల్లో పనిచేస్తున్న 34 మంది ఉద్యోగుల సర్వీసును కొనసాగించాలని సంబంధిత శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏఈఈలు చేరిన వెంటనే వారిని తొలగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అనంతరం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం జీవో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా కొనసాగుతారనే వెసులుబాటుతో గత కొంతకాలంగా పనిచేస్తున్న అధికారులను కూడా తాజా ఉత్తర్వులతో తొలగించారు.
మొత్తం 72 మంది అధికారులు నీటిపారుదలశాఖలో పదవీ విరమణ చేసిన ప్పటికీ వివిధ రకాల ఉత్తర్వులతో కొనసాగుతున్నారని ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఇందులో ఈఎన్సీ(జనరల్)గా పనిచేసిన సి.మురళీధర్ రాజీనామా చేయగా రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును ప్రభుత్వం తొలగించింది. ఇక చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న హమీద్ఖాన్ పొడిగింపు పదవీ కాలం పూర్తయింది. వీరితో పాటు చాలా మంది పొడిగింపు ఉత్తర్వులతో కొనసాగుతున్నవారి పదవీ కాలం పూర్తికావడంతో వారంతా సర్వీసు నుంచి రిలీవ్ అయ్యారు.
ఎత్తిపోతల పథకాల సలహాదారుడు పెంటారెడ్డిని మరికొన్ని నెలల పాటు సర్వీసు పొడిగించారు. కాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ)ల నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ ఇప్పటికే చేపట్టి, మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది. వీరు నీటిపారుదల శాఖలో చేరిన తర్వాత 34 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), టెక్నికల్ అధికారులు(టీవో), వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.