Share News

Tummala :భరోసా.. ఇకపై పంట వేసిన రైతులకే..

ABN , Publish Date - Sep 14 , 2024 | 02:56 AM

ఇక నుంచి పంట వేసిన వారికే రైతుభరోసా(పంట సాయం) ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Tummala :భరోసా.. ఇకపై పంట వేసిన రైతులకే..

  • ఎకరానికి 2 సీజన్లకు కలిపి రూ.15 వేలు

  • ఈ పథకం కింద గత ప్రభుత్వం

  • రూ.25 వేల కోట్లు వృథా చేసింది

  • త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ

  • రూ.2 లక్షలకు పైగా ఉన్నవారికి కూడా..

  • ఇప్పటికే రూ.18 వేల కోట్లు రైతుల

  • ఖాతాల్లో జమ చేశాం: మంత్రి తుమ్మల

అలంపూర్‌ చౌరస్తా, సెప్టెంబరు 13: ఇక నుంచి పంట వేసిన వారికే రైతుభరోసా(పంట సాయం) ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎకరాకు ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని, ఈ నగదు పంట సాగు చేసిన రైతులకే ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో శుక్రవారం నూతన మార్కెట్‌ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మరో మంత్రి జూపల్లితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుభరోసా కింద అనర్హులను చేర్చి సుమారు రూ.25 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు.


రాష్ట్రంలో ఇప్పటిదాకా 22 లక్షల మందికి, రూ.18 వేల కోట్ల మేరకు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. గతంలో మాదిరిగానే రుణమాఫీ చేస్తున్నామని, ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారు. రెండు లక్షలకు పైగా రుణం ఉన్నవారికి కూడా మాఫీ చేస్తామని తెలిపారు. అయితే రెండు లక్షలకు పైన ఎంత ఉంటే అంత బకాయిని రైతులు తమ ఖాతాల్లో జమ చేసుకుంటే తక్కిన రెండు లక్షల రుణాన్ని మాఫీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకా మూడు లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉందని, వారందరితో పాటు తెల్ల రేషన్‌ కార్డులేని రైతులకు కూడా ఈ నెలాఖరులోపు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.


రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ నాయకుల తప్పుడు మాటలను నమ్మొద్దని రైతులకు సూచించారు. పంటలు సాగుచేసి నష్టపోరాదన్న సంకల్పంతో రైతుల పేర్లపై ప్రతీ ఎకరాకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నామని చెప్పారు. శ్రీశైలం నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీచుపల్లి వద్ద ఆయిల్‌ ఫ్యాక్టరీని ఏడాదిలోపు అందుబాటులోకి తెస్తామని, పామాయిల్‌ తోటలను రైతులు పండించి లాభాలు గడించాలని ఆయన సూచించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో 8 లక్షల కోట్లు అప్పుచేశారని, ఫలితంగా నేటి ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తోంద న్నారు. గొప్పలకు పోయిన నాటి ప్రభుత్వం.. రింగురోడ్డు భుములను అమ్మి రైతుభరోసా డబ్బులను చెల్లించిందని విమర్శించారు.

Updated Date - Sep 14 , 2024 | 02:56 AM