Share News

Hyderabad: ఆగస్టు 1 విడుదల!

ABN , Publish Date - Jun 16 , 2024 | 03:04 AM

రాష్ట్రంలో సవరించిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వాటిని ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విలువల నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీలు ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయికి వెళ్లనున్నాయి.

Hyderabad: ఆగస్టు 1 విడుదల!

  • రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ తేదీ ఇదే

  • 18 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, 24న తుది జాబితా

  • బహిరంగ మార్కెట్‌, రిజిస్ట్రేషన్‌ విలువల పరిశీలన

  • అంతరం తక్కువగా ఉన్నచోట కొద్దిగా.. ఎక్కువగా ఉన్నచోట భారీగా విలువల సవరణకు ప్రతిపాదనలు

  • లే అవుట్లు వేసేందుకు అనువైన గ్రామాల గుర్తింపు

  • హైవేలు, వాణిజ్య ప్రాంతాల్లో వేర్వేరు ప్రతిపాదనలు

  • 18 నుంచి పరిశీలన, 24న జాబితా

  • మార్కెట్‌, రిజిస్ట్రేషన్‌ విలువల పరిశీలన

  • అంతరం తక్కువగా ఉన్నచోట కొద్దిగా.. ఎక్కువున్నచోట భారీగా సవరణలు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సవరించిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వాటిని ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విలువల నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీలు ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయికి వెళ్లనున్నాయి. అక్కడ జరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార లావాదేవీలను తెలుసుకోనున్నాయి. అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. వాటిని పరిశీలించి జూలై 24న రిజిస్ట్రేషన్‌ విలువల తుది జాబితాను సర్కారు ప్రకటించనుంది. సదరు వివరాలను జూలై 31 నాటికి కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయనుంది. ఈ మేరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణకు మార్గదర్శకాలు వెలువడ్డాయి. గ్రామీణ ప్రాంతాల కమిటీలో చైర్మన్‌గా ఆర్డీవో, సభ్యులుగా ఎమ్మార్వో, ఎండీవో, జిల్లా రిజిస్ట్రార్‌, ఆడిట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, కన్వీనర్‌గా సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ను నియమించారు.


పట్టణ ప్రాంతాల కమిటీలో చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌, సభ్యులుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌, సంబంధిత మునిసిపల్‌ కమిషనర్‌, కన్వీనర్‌గా సబ్‌ రిజిస్ట్రార్‌ను నియమించారు. కంటోన్మెంట్‌లో కలెక్టర్‌ చైౖర్మన్‌గా కమిటీని నియమించారు. ఈ కమిటీలు తమ తమ పరిధిలో వ్యవసాయ భూములు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు తదితరాల స్థిరాస్తుల విలువలు బహిరంగ మార్కెట్‌లో ఎంత ఉన్నాయి!? వాటి వాటి రిజిస్ట్రేషన్‌ విలువలు ఎంత ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తుంది. ధరలకు సంబంధించిన వివరాల కోసం స్థానిక సంస్థలు, తహశీల్దారులను సంప్రదించనుంది. మార్కెట్‌ విలువలు తెలుసుకునేందుకు వివిధ మార్గాల ద్వారా అవసరమైన నివేదికలు సేకరించనుంది. అంతరం తక్కువగా ఉన్నచోట కొద్దిగానూ.. ఎక్కువగా ఉన్నచోట భారీగాను రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించాలని ఆయా కమిటీలు సిఫారసు చేయనున్నాయని తెలుస్తోంది. వీటిని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో పరిశీలించి, సవరింపుపై తుది నిర్ణయం తీసుకోనుంది.


గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీప ప్రాంతాల్లోని భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాల మార్కెట్‌ రేట్లను సదరు కమిటీలు తెలుసుకోనున్నాయి. పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన సెజ్‌ల సమీపంలోని స్థలాల మార్కెట్‌, రిజిస్ట్రేషన్‌ విలువల వ్యత్యాసాన్ని గుర్తించనున్నాయి. వ్యవసాయేతర కార్యక్రమాలు (అభివృద్ధి) చేపట్టేందుకు అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించనున్నాయి. వాటి సమీప, పక్క పక్కనే ఉన్న గ్రామాల్లోని భూముల ధరలను తెలుసుకొని వాటికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించనున్నాయి. గ్రామాల మ్యాప్‌లను పరిశీలించి, వాటిలో నుంచి వెళ్తున్న జాతీయ, రాష్ట్ర రహదారులను గుర్తించనున్నాయి. వాటి సమీపంలో లే అవుట్‌లు చేసిన ప్రాంతాలు, భవిష్యత్‌లో అందుకు అవకాశం ఉన్న గ్రామాలను కూడా గుర్తించనున్నాయి. అక్కడికి సబ్‌ రిజిస్ట్రార్‌, డిస్ట్రిక్ట్‌ రిజిస్టార్‌ నేరుగా వెళ్లి మార్కెట్‌ ధరలను తెలుసుకోనున్నారు. రెవెన్యూ అధికారులు, రియల్‌ వ్యాపారులతో మాట్లాడనున్నారు. వెంచర్లకు సంబంధించిన బ్రోచర్లు, వివిధ ప్రచార ప్రకటనలను పరిశీలించి, మార్కెట్‌ విలువలను తెలుసుకోనున్నారు. గ్రామాల మధ్య రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల వ్యత్యాసాన్ని గుర్తించనున్నారు. ఒక ప్రాంతంలో ఎక్కువ ధర ఉండి.. రియల్‌ ఎస్టేట్‌ జోరుగా సాగుతూ సమీప గ్రామ పరిధిలో తక్కువ రిజిస్ట్రేషన్‌ విలువ ఉంటే అక్కడి తేడాను గుర్తిస్తారు. ఇలాంటి గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ విలువలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు.


పట్టణ ప్రాంతాల్లో..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నివాస స్థలాలు, ఇళ్లు, ప్లాట్ల ధరలను కమిటీలు తెలుసుకోనున్నాయి. ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న వాణిజ్య ప్రాంతాలు, కాలనీలు, విల్లాలు, క్లబ్‌లు ఉన్న ప్రాంతాల్లో వివిధ స్థాయిలో రిజిస్ట్రేషన్‌ విలువలు ఉండేలా ప్రతిపాదనలు చేయనున్నాయి. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని భూములు, ప్లాట్లు, కాలనీల్లో ఉన్న ధరలను పరిశీలించనున్నాయి. వాస్తవానికి ఇక్కడ బహిరంగమార్కెట్‌కు, రిజిస్ట్రేషన్‌ చార్జీలకు భారీ తేడా ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎకరా భూమి ధర బహిరంగ మార్కెట్లో కోట్లలో ఉంటే.. రిజిస్ట్రేషన్‌ విలువ వేలల్లో ఉంది. చేవెళ్లలో ఎకరా భూమి ధర రూ.2 కోట్లు పలుకుతుంటే.. రిజిస్ట్రేషన్‌ విలువ రూ.42లక్షలే ఉంది. మేడ్చల్‌ జిల్లాలో ఏ ప్రాంతం తీసుకున్నా బహిరంగ మార్కెట్‌ ధర ఎకరం కోట్లలోనే ఉంది. జూబ్లీహిల్స్‌లో గజం విలువ 3లక్షలు ఉంటే రిజిస్ట్రేషన్‌ విలువ రూ.90 వేలే. ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా రిజిస్ట్రేషన్‌ విలువలను సవరిస్తూ అంచనాలు రూపొందించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 03:04 AM