Share News

Mahesh Kumar Goud: జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగదు

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:22 AM

గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నది అపోహ మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  అన్యాయం జరగదు

బీసీ బిడ్డగా నేను భరోసా ఇస్తున్నా.. గ్రూప్‌-1లో రిజర్వుడ్‌.. కేటగిరీకి నష్టమన్నది అపోహే

  • అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయండి

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పుదోవ పట్టిస్తున్నాయి

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నది అపోహ మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఒక బీసీ బిడ్డగా, కాంగ్రెస్‌ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున తాను భరోసా ఇస్తున్నానని, రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరగదని చెప్పారు. ఓపెన్‌ కేటగిరీలో ఎంపికైన బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలు అదే కేటగిరీలో కొనసాగుతారని స్పష్టం చేశారు.


ఓపెన్‌ కేటగిరీలో ఎంపికైన బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసుకెళ్లి రిజర్వుడు క్యాటగిరీ ఉద్యోగాల్లో పడేస్తారన్నది పచ్చి అబద్ధమన్నారు. ఈ మేరకు ఆదివారం గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. గాంధీభవన్‌ సేకరించిన సమాచారం ప్రకారం 1:50 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల్లో 75 నుంచి 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందినవారే ఉన్నట్లు తేలిందన్నారు. దీనిని బట్టి గ్రూప్‌-1 పోస్టుల్లో 75 నుంచి 80 శాతం రిజర్వుడు కేటగిరీల వారే ఎంపిక కాబోతున్నారని తెలిపారు. పరీక్షలు వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు జరుగుతాయో తెలియదని, అపోహలకు పోయి జీవితాలను పాడు చేసుకోవద్దని గ్రూప్‌-1 అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని సూచించారు.


  • అభ్యర్థులపై లాఠీచార్జి చేయొద్దు..

పోలీస్‌ శాఖ తొందరపడి గ్రూప్‌-1 అభ్యర్థులను ఇబ్బంది పెట్టవద్దని, లాఠీచార్జి వంటివి జరగకుండా చూడాలని మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కై అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారిలో లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీని నెత్తిన పెట్టుకుని ఓట్లేసినందునే తాము అధికారంలోకి వచ్చామని, వారిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోబోమని అన్నారు. జీవో 29పై శనివారం తాను, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, దామోదర్‌ రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ కలిసి అధికారులతో మూడున్నర గంటల పాటు సంప్రదింపులు జరిపామని, తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగబోదన్న నిర్ణయానికి వచ్చామన్నారు.


  • అభ్యర్థులను రెచ్చగొడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌..

ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈ పదిన్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లెక్కలు చెప్పాలన్నారు. ఎన్ని పీఎ్‌సయూలను మూసేశారో, ఎన్ని ఉద్యోగాలను పీకేశారో తమ వద్ద లెక్క ఉందని చెప్పారు. అలాగే నియామకాలు అంశంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఈ పదేళ్లలో పట్టుమని 35 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. దీనిని బట్టి నిరుద్యోగుల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలన్నారు.


అధికారంలో ఉన్న పదేళ్లలో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించని బీఆర్‌ఎస్‌.. నేడు అభ్యర్థులకు నష్టం చేయడానికి పూనుకుందని ఆరోపించారు. దీనిని అభ్యర్థులు అర్థం చేసుకోవాలన్నారు. లోపాయికారీ ఒప్పందంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు విద్యార్థి లోకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మహేశ్‌కుమార్‌గౌడ్‌ మండిపడ్డారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయం నుంచి వస్తున్న స్ర్కిప్టును రాష్ట్రంలో ఈ రెండు పార్టీలూ అమలు చేస్తున్నాయని అన్నారు. జీవో 29.. ఫిబ్రవరి 23న విడుదలైతే ప్రతిపక్షాలకు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని, ఇన్ని రోజులు ఎందుకు నోరు మూసుకున్నాయని ప్రశ్నించారు.

Updated Date - Oct 21 , 2024 | 03:22 AM