Share News

Mahabubabad: ఇద్దరు యువతుల ప్రేమకు విషాదాంతం

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:25 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు వాళ్లని తమ ఇళ్లకు తీసుకెళ్లగా.. ఇక, తాము కలిసి జీవించలేమనే ఆవేదనతో ఆ యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Mahabubabad: ఇద్దరు యువతుల ప్రేమకు విషాదాంతం

  • ఇన్‌స్టాలో పరిచయం.. హైదరాబాద్‌లో పెళ్లి

  • పెద్దలు ఇంటికి తీసుకురావడంతో ఆత్మహత్యాయత్నం

  • ఒకరి మృతి, ప్రాణాపాయ స్థితిలో మరొకరు

కురవి, జూన్‌ 7: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు వాళ్లని తమ ఇళ్లకు తీసుకెళ్లగా.. ఇక, తాము కలిసి జీవించలేమనే ఆవేదనతో ఆ యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరిలో ఒకరు శుక్రవారం మరణించగా, మరో యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలానికి చెందిన ఓ యువతి (21)కి గార్ల మండలానికి చెందిన యువతి(20)కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారిన వీరిద్దరూ మూడు నెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లి పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టారు.


విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఇళ్లకు తీసుకువచ్చారు. అయితే, మే చివరి వారంలో ఆ ఇద్దరూ విజయవాడ పారిపోగా.. కురివి మండలానికి చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని స్వస్థలానికి తీసుకొచ్చిన పోలీసులు.. కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. నాటి నుంచి ఎడబాటుకు గురైన ఆ యువతులు జూన్‌ 1న మహబూబాబాద్‌లో కలుసుకుని ఎలుకల మందు తాగారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారిని మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కురవి మండలానికి చెందిన యువతి శుక్రవారం చనిపోయింది. మరో యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది.

Updated Date - Jun 08 , 2024 | 05:25 AM