Share News

Tummala Nageswara Rao :నాడు చేనేతలను పట్టించుకోలేదు

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:36 AM

‘‘మాజీ మంత్రి కేటీఆర్‌.. ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అన్నట్లు ఉంది, గత పదేళ్లలో చేనేత రంగాన్ని అన్నిస్థాయిల్లో అస్తవ్యస్తంచేసి, సొంత లాభాలకు వాడుకుని ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయడం విడ్డూరం’’

Tummala Nageswara Rao :నాడు చేనేతలను పట్టించుకోలేదు

  • దొంగే.. దొంగ, దొంగ అన్నట్లుగా కేటీఆర్‌ తీరు

  • చేనేతలో సంక్షోభం బీఆర్‌ఎస్‌ సర్కారు పుణ్యమే: తుమ్మల

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ మంత్రి కేటీఆర్‌.. ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అన్నట్లు ఉంది, గత పదేళ్లలో చేనేత రంగాన్ని అన్నిస్థాయిల్లో అస్తవ్యస్తంచేసి, సొంత లాభాలకు వాడుకుని ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయడం విడ్డూరం’’ అని వ్యవసాయ, మార్కెటింగ్‌, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూరే పథకాల కోసం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2018లో పవర్‌ లూమ్‌ కార్మికులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లింక్డ్‌ వేతనాల పరిహార పథకం (10ు యార్న్‌ సబ్సిడీ) ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యార్న్‌ సబ్సిడీకి టెస్కో నుంచి రూ.33.23 కోట్లు విడుదల చేసిందన్నారు. మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునికీకరణకు బీసీ సంక్షేమశాఖ శాఖ నుంచి 2024-25 సంవత్సరానికి కేటాయించిన రూ.400 కోట్ల బడ్జెట్‌ వినియోగించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించినట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సుమారు రూ.255.27 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వచ్చినట్లు తెలిపారు. 2023లో బతుకమ్మ చీరల పథకం కింద టెస్కోకు రూ.351.52 కోట్లు చెల్లించలేదన్నారు. ఈ బకాయిల్లో రూ. 100 కోట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసినట్లు తుమ్మల వివరించారు. జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న 6 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపి అర్హులైన వారికి ఎక్స్‌ గ్రేషియా చెల్లించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు తుమ్మల తెలిపారు.

Updated Date - Jun 26 , 2024 | 05:36 AM